కందుకూరు : పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని కందుకూరు పోలీస్ స్టేషన్ సీఐ లిక్కి కృష్ణంరాజు కోరారు, శుక్రవారం మొహర్రం సందర్భంగా ఆయన మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన అనంతరం దాసర్లపల్లి గ్రామంలో బీబీకా అలంకు దట్టిలను సమర్పించారు. ఈ సందర్భంగా ముస్లీం సొదరులు సీఐకి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఉండాలన్నారు. పండుగలు ఎవరివైనా ప్రశాంతంగా జరుపుకోవాలని పేర్కొన్నారు. మొహర్రం పండుగను ముస్లీంలు ఎంతో పవిత్రంగా జరుపుకుంటారని చెప్పారు. ప్రభుత్వం పండుగలకు ప్రాధాన్యతను ఇస్తుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పొలెమోని బాలమణి అశోక్ ముదిరాజ్, పలువురు ముస్లీం సోదరులు పాల్గొన్నారు.
గ్రామాల్లో ఊరేగింపు..
మండల పరిధిలోని కందుకూరు, కొత్తగూడ, దాసర్లపల్లి, అగర్మియగూడ, మహమ్మద్నగర్, నేదునూరు, పులిమామిడి, గూడూరు తదితర గ్రామాల్లో బీబీకా అలంను ముస్లీంలు ఆయా గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం ఊరేగింపు నిర్వహించారు. పలువురు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఊరేగింపు అనంతరం గ్రామాల్లో చెరువులు, కుంటలలో నిమ్మజ్జనం చేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యులు సులేమాన్, ఆసీఫ్ అలీ, కమాల్భేగ్, అప్జల్ భేగ్, అంజద్, ఖదీర్, అజీజ్, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.