పహాడీషరీఫ్: ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో నిత్యం ఆరోగ్యకరంగా ఉంటారని బాలాపూర్ ఆరోగ్య కేంద్రం వైద్య అధికారి ఎన్. శ్రీనివాస్ అన్నారు. మంగళవారం జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్నగర్లో వైద్యశిబిరం నిర్వహించారు. సాధారణ జ్వరం, జలుబు , దగ్గు వంటి సమస్యలతో వచ్చిన 325 మంది కాలనీ వాసులకు వైద్యులు పరీక్షించి మందులను అందజేశారు.
82 మంది నుంచి రక్తనమూనాలను తీసుకున్నారు. ఈ సందర్భంగా వైద్యధికారి మాట్లాడుతూ కాలనీలలో, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా, కొబ్బరి బోండాలలో, టైర్లలో, కూలర్లలో నీటిని తీసి వేయాలన్నారు. ఇండ్లలోని పాత్రలలో వారానికి మించి నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మజర్ అలీ, సూపర్వైజర్ కె. శ్రీనివాస్, వైద్యుడు అజయ్కుమార్ పాల్గొన్నారు.