6వ తరగతి ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ఈ నెల 30 వరకు గడువు
నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తున్న ప్రభుత్వం
ఖమ్మం ఎడ్యుకేషన్, ఏప్రిల్12: కార్పొరేట్ స్థాయిలో తమ పిల్లలకు విద్యనందించాలనే నిరుపేదల ఆశయాన్ని నిజం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం మోడల్ పాఠశాలలను ఏర్పాటు చేసింది. ఈ పాఠశాలలో ఇప్పటి వరకు చదివిన విద్యార్థులు ఎంతో మంది ట్రిపుల్ ఐటీల్లో సీట్లు సాధించారు. కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వం విద్యనందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దుతున్నది. ఖమ్మం జిల్లాలో సింగరేణి, పెనుబల్లి మండలాల్లో రెండు పాఠశాలలున్నాయి. వీటిల్లో సుమారు వెయ్యి మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం వీటిలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూన్ 6న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. అలాగే 7నుంచి 10వ తరగతి బ్యాక్లాగ్ సీట్లను భర్తీ చేస్తున్నారు. మరి ఈ పాఠశాలలకు ఉన్న ప్రత్యేకతలు పరిశీలిస్తే..
విద్యాబోధన, క్రీడలు, విద్యార్థులకు ఇష్టమైన రంగాల్లో వారిని ప్రోత్సహించేందుకు వీలుగా మోడల్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. నాణ్యమైన భోజనం, కొత్తకొత్త భవనాలు, మినరల్ వాటర్, దుస్తులు, ఇతర సౌకర్యాలను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నది. ఆరో తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్యను అది ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తున్నది.
నాణ్యమైన విద్య..
ట్రిపుల్ఐటీల్లో సీట్లు, నేషనల్ మీన్స్కమ్ మెరిట్(ఎన్ఎంఎంఎస్) వంటి ప్రతిభా పరీక్షల్లో విద్యార్థులు సీట్లు సాధిస్తున్నారు. సమర్థులైన, సుదీర్ఘ అనుభవం కలిగిన ఉపాధ్యాయుల బోధనతో పాటు 24 గంటల పాటు ఉపాధ్యాయుల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంటర్ విద్యార్థులకు ఐఐటీ, ఎంసెట్, నీట్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి ప్రోత్సహించేలా బహుమతులు అందిస్తారు. సింగరేణి పాఠశాలకు 2016-17లో స్వచ్ఛవిద్యాలయ పురస్కారం, 2018-19లో ఇన్స్పైర్లో జాతీయ స్థ్ధాయికి విద్యార్థ్ధి ఎంపికైయ్యాడు.
6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.
ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి, సింగరేణి మండలాల్లోని మోడల్ స్కూల్స్లో 6వ తరగతిలో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఈ నెల15వ తేదీ నుంచి దరఖాస్తులను తీసుకుంటున్నారు. ఈ నెల 30వ తేదీలోగా ఓసీ విద్యార్థులు రూ. 150లు, బీసీ, ఎస్టీ, ఎస్సీ విద్యార్థులు రూ.75లు చెల్లించి ఆన్లైన్లో http://telanganams.cgg.gov.inలో దరఖాస్తు చేయాలి. జూన్ 6వ తేదీన నిర్వహించే ప్రవేశ పరీక్షలో పొందే మార్కుల ద్వారా సీట్లు కేటాయిస్తారు. 6వ తరగతిలో 100 సీట్లు ఉన్నాయి.
7నుంచి 10వ తరగతి బ్యాక్లాగ్ సీట్ల భర్తీ..
7వ తరగతి నుంచి 10వ తరగతిలో బ్యాక్లాగ్ సీట్లను భర్తీ చేసేందుకు ఈ నెల 20వ తేదీ నుంచి ఈ నెల 30వ తేదీ లోగా ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. విద్యార్థులు telanganams.cgg.gov.inలో దరఖాస్తు చేయాలి. వీరికి జూన్ 5వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. వీటిని రిజర్వేషన్ల ప్రాతిపాదికన భర్తీ చేస్తారు.
ఇవి కూడా చదవండి
గోవాలో ఒంటరిగా బరిలో దిగుతాం: ఆప్
ఓటమి భయంతో దీదీలో అలజడి : మోదీ