పర్ణశాల, ఏప్రిల్ 10: పోడు భూముల సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. దుమ్ముగూడెం మండలం పైడిగూడెం పంచాయతీలో కొన్ని రోజులుగా అటవీ అధికారులకు, గ్రామ గిరిజనులకు పోడుభూముల విషయంలో వివాదం జరుగుతోంది. రెండు రోజుల క్రితం అటవీ అధికారులు పైడిగూడెం గ్రామస్తులపై దుమ్ముగూడెం పోలీస్స్టేషన్లో కేసు పెట్టారు. ఈ విషయాన్ని పైడిగూడెం గ్రామస్తులు ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు దృష్టికి తీసుకెళ్లగా శనివారం ఆయన పైడిగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామస్తులతో ఆయన మాట్లాడుతూ పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంతో కాలంగా పోడు సాగుచేసుకుంటున్న గిరిజనులను అటవీ అధికారులు వేధింపులకు గురిచేయడం తగదన్నారు. అక్కడి నుంచే జిల్లా అటవీ శాఖ అధికారి రంజిత్నాయక్కు ఫోన్చేశారు. పైడిగూడెం గ్రామస్తులపై అటవీశాఖ అధికారుల దౌర్జన్యం విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. తెలంగాణ ప్రభుత్వం స్టేటస్ కో అమలుచేస్తున్నప్పటికీ అటవీ అధికారులు పోడుభూముల్లోకి వెళ్లడం సరికాదని అన్నారు. పాత పోడు భూములకు పట్టాలు ఇప్పిస్తామని, కొత్తగా అడవులు నరకొద్దని పోడు గిరిజనులకు సూచించారు.
సొమ్మసిల్లిన మహిళకు సాయం..
సమావేశం ప్రారంభానికి ముందు అక్కడి గిరిజన మహిళ కంగాల పుల్లమ్మ సొమ్మసిల్లి పడిపోయింది. అప్పుడే అక్కడికి వచ్చిన రేగా కాంతారావు, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు ఆమెను ఎత్తుకొని వచ్చి మంచంపై పడుకోబెట్టి ప్రథమచికిత్స అందించారు. రేగా కాంతారావు తన వెంట తెచ్చుకున్న జొన్నజావను ఆ మహిళకు అందించారు. అనంతరం అటవీ అధికారులు మొక్కలు నాటుతున్న పోడు భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు. అక్కడి ఫారెస్టు అధికారులతో మాట్లాడుతూ పోడు భూముల జోలికి వెళ్లొద్దని, ఉన్నతాధికారులతో మాట్లాడానని అన్నారు. జడ్పీటీసీ తెల్లం సీతమ్మ, ఎంపీపీ రేసు లక్ష్మి, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై తిరుపతి, ఆర్ఐ ఆదినారాయణ, ఎంపీడీవో ముత్యాలరావు, అటవీశాఖ రేంజర్ కనకమ్మ, సర్పంచ్లు జ్యోతి, మంగమ్మ, మట్టా వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు రామారావు, భీమరాజు, టీఆర్ఎస్ నాయకులు సాగి రాజు, అర్జున్, కామేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ 2021: జేసన్ రాయ్ వచ్చేశాడు!
దీదీ ముఖంలో ఓటమి నైరాశ్యం : మోదీ