ఖమ్మం ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఖమ్మం పోలీస్ కమిషనర్( సీపీ)గా విష్ణు వారియర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న ఆయన బదిలీపై ఇక్కడికి వస్తున్నారు. అక్కడ మూడేళ్లకు పైగా ఆయన పనిచేశారు. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తూనే నిర్మల్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాల ఇన్చార్జి ఎస్పీగా ఆరు నెలలు విధులు నిర్వహించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా చూసుకున్నారు. భైంసా అల్లర్లు జరిగిన సమయంలో పోలీసు బృందాలతో వెంటనే చేరుకుని అల్లర్లను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఖమ్మం సీపీగా పనిచేసిన తఫ్సీర్ ఇక్బాల్కు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
ఖమ్మం జిల్లాకు సీపీ తఫ్సీర్ ఇక్బాల్ సేవలు
కమిషనరేట్ తొలి కమిషనర్గా 2017 ఏప్రిల్ 3 న ఆయన బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి నాలుగు సంవత్సరాల పాటు విధులను నిర్వహించి అరుదైన రికార్డు సృష్టించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎస్పీలు ఎవరూ నాలుగేళ్ల పాటు పనిచేయలేదు. ఆయన హయాంలో జరిగిన ఎన్నికలను ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. గత నెల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా బందోబస్తు చేపట్టారు. గతంలో ఆయన జిల్లాలో అదనపు ఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. జిల్లా మీదుగా ఇతర ప్రాంతాలకు రవాణా అవుతున్న గంజాయి అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపారు. నకిలీ నోట్ల దందాను అరికట్టారు. లాక్డౌన్ సమయంలో ప్రజలకు కరోనా ప్రబలకుండా పోలీస్శాఖ ద్వారా సేవలందించారు. ఈయన హయాంలోనే ఖమ్మం పోలీస్ కమిషనరేట్ నిర్మాణం పూర్తయింది. నేర నియంత్రణకు ఖమ్మం నగరంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.
ఇవి కూడా చూడండి..
ఉత్తరాఖండ్లో దావానలం.. 1200 హెక్టార్ల అడవి బుగ్గి
దేశంలో ఇప్పటివరకు 7.5 కోట్ల మందికి వ్యాక్సిన్: కేంద్రం