కరోనా కట్టడిలో పారిశుధ్య కార్మికులు, సిబ్బంది
గ్రామాల పరిశుభ్రతలో వీరిదే కీలక పాత్ర
ప్రాణాలు పణంగా పెట్టి సేవలు
అశ్వారావుపేట, మే 14:కరోనా కట్టడిలో పారిశుధ్య కార్మికులు, సిబ్బంది పాత్ర కీలకం. కోడి కూయకముందే నిద్రలేచి వీధులు, మురుగు కాల్వలు శుభ్రం చేస్తారు. కొవిడ్ బాధితుల ఇంటి పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తారు. విపత్కర సమయంలో ప్రాణాలు సైతం లెక్కచేయకుండా ‘ విలేజ్ వారియర్స్’ సేవలందిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని 481 పంచాయతీల్లో సుమారు 1,300 మంది శానిటేషన్ సిబ్బంది పారిశుధ్య పనుల్లో భాగస్వాములు అవుతున్నారు.
కోడి కూయకముందే నిద్రలేస్తున్నారు.. మనం నిద్రలేవకమునుపే వీధులను శుభ్రం చేస్తున్నారు.. బ్లీచింగ్ చల్లుతున్నారు.. కరోనా బాధితుల ఇంటి పరిసరాల్లో సోడియం హైపోక్లోరైట్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు.. గ్రామాల్లో కరోనా కట్టడిలో వారిదే కీలకపాత్ర.. ప్రతిరోజు ప్రాణాలను పణంగా పెట్టి మన ఆరోగ్యం కోసం పనిచేస్తున్నారు ఈ సఫాయివాలాలు. ఒకవైపు కరోనా విస్తరిస్తున్నప్పటికీ మొక్కవోని ధైర్యంతో ‘వారియర్స్’గా పనిచేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలోని 481 పంచాయతీల్లో సుమారు 1,300 మంది పారిశుధ్య కార్మికులు ఉన్నారు. వీరంతా కలెక్టర్ ఆదేశాల మేరకు డీపీవో పర్యవేక్షణలో పనిచేస్తున్నారు. మండలస్థాయిలో ఎంపీవోలు వీరికి మార్గనిర్దేశం చేస్తున్నారు. కొవిడ్-19 విస్తరిస్తున్న నేపథ్యంలో కార్మికులు పకడ్బందీగా పారిశుధ్య చర్యలు చేపడుతున్నారు. గ్రామాల్లో ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే బాధితుల ఇంటి పరిసరాల్లో సోడియం హైపో క్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. సమీపంలో నివసిస్తున్న వారికి కొవిడ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామంలోని ప్రతి వీధిలో మురుగు కాలువలను శుభ్రం చేస్తున్నారు. వీధుల్లో బ్లీచింగ్ చల్లుతున్నారు. సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, కో-ఆప్షన్ సభ్యులు ఎప్పటికప్పుడు అప్రమత్తమవుతూ ఈ పనులు చేయిస్తున్నారు. పంచాయతీ కార్మికులు కొవిడ్ బారిన పడకుండా పాలకవర్గాలు మాస్క్లు, శానిటైజర్లు అందిస్తున్నాయి. వారి ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాయి.
ముమ్మర ప్రచారం..
గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో పంచాయతీల్లో పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. కొవిడ్ నివారణపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. నివాస ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అనవసరంగా ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రావొద్దని గ్రామస్తులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం నిర్దేశించిన సమాయాల్లో నిత్యావసరాల కోసం బయటకు వచ్చినా తప్పనిసరిగా మాస్క్ ధరించాలంటున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత చేతులను శానిటైజ్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
కరోనా రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో సిబ్బంది, కార్మికులందరినీ అప్రమత్తం చేస్తున్నాం. ఎప్పటికప్పుడు కార్మికులతో పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. కార్మికులంతా కరోనా కట్టడికి తమ వంతు సేవలు అందిస్తున్నారు. ప్రజల్లో మనోైస్థెర్యం కలిగించేలా కార్మికులు ముందుండి పని చేస్తున్నారు. పంచాయతీలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు.