ఆదివాసీ గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ బాటలు పరిచింది. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా వంటి ప్రధాన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. విద్యాభివృద్ధి కోసం గురుకులాలు, ప్రత్యేక బీఈడీ కళాశాల ఏర్పాటు చేసింది. వైటీసీ ద్వారా యువతకు వివిధ రంగాల్లో శిక్షణ అందించి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ముఖ్యంగా అదివాసీ మహిళలు, పిల్లల్లో పౌష్టికాహార సమస్యను నివారించేందుకు ప్రత్యేక నూట్రిషన్ సెంటర్పై దృష్టి సారించింది. ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ద్వారా డయాలసిస్, బ్లడ్బ్యాంక్ సహా అత్యాధునిక సౌకర్యాలతో వైద్య సేవలు అందిస్తోంది. మిషన్ భగీరథతో స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తోంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలున్న పోడుభుములకూ రైతుబంధును అందిస్తూ ఆదివాసీ రైతులకు ఆసరానిస్తోంది. ప్రభుత్వ ప్రత్యేక చొరవతో గిరిజనాభివృద్ధి విస్తరిస్తోంది.
వైటీసీ ద్వారా వృత్తి శిక్షణ కోర్సులు
భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) ద్వారా కార్పెంటర్, వెల్డింగ్, కంప్యూటర్ హార్డ్వేర్, స్మార్ట్ఫోన్ టెక్నీషియన్, ఫార్మసీ అసిస్టెంట్ తదితర కోర్సులను ఉచితంగా అందిస్తోంది. భోజనం, వసతి సౌకర్యాలనూ ఉచితంగానే కల్పిస్తోంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న యువతకు డ్రైవర్ ఎంపవర్మెంట్ పథకం ద్వారా వాహనాలు అందజేసి స్వయం ఉపాధిని పెంపొందిస్తోంది. జీసీసీ ద్వారా పెట్రోల్ బంక్, సబ్బులు, షాంపులు, పల్లిపట్టీ, న్యూట్రిషన్ బిస్కట్ల తయారీ పరిశ్రమలు నిర్వహిస్తోంది. వీటిల్లో వందశాతం గిరిజనులకే ఉపాధి కల్పిస్తోంది. భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ప్రత్యేక సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చింది.
ప్రత్యేక గురుకులాలు
గిరిజనుల పిల్లలకు ఉత్తమ విద్యను అందించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక గురుకులాలను ఏర్పాటు చేసింది. డిగ్రీ, బీఈడీ కళాశాలలు ఏర్పాటు చేస్తోంది. భద్రాచలంలో గిరిజనుల కోసం ప్రత్యేకంగా గిరిజన బీఈడీ కళాశాలను గతంలోనే ఏర్పాటు చేసింది.
వైటీసీలో శిక్షణ తీసుకొని ఉపాధి పొందుతున్నా..
ఐటీడీఏ పీవో గౌతమ్ సార్, జేడీఎం హరికృష్ణ సార్ ప్రత్యేక చొరవ తీసుకొని ఏజెన్సీలోని గిరిజన యువతకు వైటీసీలో ఉచిత శిక్షణ ఇస్తున్నారు. నేను కూడా ఫార్మసీ అసిస్టెంట్గా శిక్షణ పొందాను. ప్రస్తుతం హైదరాబాద్లోని గ్లాండ్ ఫార్మాలో నెలకు రూ.15 వేలు వేతనానికి పనిచేస్తున్నా. నాలాగే ఎంతోమంది వైటీసీలో శిక్షణ ద్వారా ఉపాధి పొందుతున్నారు.
-కుంజా వెంకటరమణ, దుమ్ముగూడెం మండలం
నెలకు రూ.20 వేలు సంపాదిస్తున్నా..
భద్రాచలం ఐటీడీఏలోని వైటీసీలో సెల్ఫోన్ రిపేరింగ్లో శిక్షణ పొందాను. ప్రస్తుతం మా ఊర్లోనే సెల్ఫోన్ రిపేరింగ్ షాపు పెట్టుకున్నా. నెలకు రూ.20 వేలకు తక్కువ కాకుండా సంపాదించుకుంటున్నా. భద్రాచలంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్ (వైటీసీ) నాలాంటి ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతోంది. -నూపా రమేశ్, కోయ నరసాపురం