సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో గర్భిణులు, బాలింతలు, చిన్నారుల కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సెప్టెంబర్ను పోషణ్ అభియాన్ మాసంగా ప్రకటించిన ప్రభుత్వం.. ఇందుకోసం యంత్రాంగాన్ని సిద్ధం చేసి లక్ష్యం వైపు నడిపించింది. తల్లిపాలతోపాటు సంపూర్ణ పోషకాలున్న ఆహారాన్ని తీసుకోకపోవడంతో చిన్నారులు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని నివారించేందుకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండేందుకు సూచనలు చేయడంతోపాటు అంగన్వాడీ కేంద్రాల ద్వారా కోడిగుడ్లు, పాలు, ఇతర పోషకాహారాన్ని అందించింది. సెప్టెంబర్ 1వ తేదీన ప్రారంభమైన కార్యక్రమం 30వ తేదీతో ముగిసింది.
నిర్మల్, అక్టోబర్ 2 (నమస్తే తెలంగాణ) : పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఆరోగ్యస్థాయిని మెరుగుపర్చడానికి.. శిశు మరణాలు తగ్గించి, పిల్లలకు అవసరమైన పౌష్టికాహారాన్ని అందించడానికి ప్రభుత్వం అంగన్వాడీ వ్యవస్థకు రూపకల్పన చేసింది. నిర్మల్ జిల్లాలోని 19 మండలాల పరిధిలో నాలుగు ఐసీడీఎస్ ప్రా జెక్టులున్నాయి. ఖానాపూర్, భైంసా, ముథో ల్, నిర్మల్ ప్రాజెక్టుల పరిధిలో 926 అంగన్వాడీలు ఉండగా, మరో 110 మినీ అంగన్వాడీలు పనిచేస్తున్నాయి. గత ఆగస్టు నెల గణాంకాల ప్రకారం జిల్లాలో గర్భిణులు, బాలింతలు 12,875 మంది ఉండగా, చిన్నారులు 61,997 మంది ఉన్నారు. వీరిలో అ ప్పుడే పుట్టిన శిశువు నుంచి ఏడు నెలల వయస్సున్న చిన్నారులు 6,390 మంది, ఏడు నెల ల నుంచి ఏడాది లోపు వారు 5,960, ఏడా ది వయస్సు నుంచి మూడేండ్ల లోపు వారు 22,672, మూడు నుంచి ఆరేండ్లలోపు చిన్నారులు 26,975 మంది ఉన్నారు. వీరిలో 45,399 మంది పిల్లల ఎత్తు, బరువు పరిశీలించగా.. 2,141 మంది పిల్లలను తక్కువ బరువుతో ఉన్నట్లు గుర్తించారు. అలాగే 853 మంది అతి తీవ్ర పోషణలోపంతో ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ ప్రభుత్వం ప్రతిరోజూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నది.
వయస్సుకు తగ్గ ఎత్తు, బరువు ఉండేలా చర్యలు
చిన్నారుల వయస్సుకు తగినట్లు బరువు, ఎత్తు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. చిన్నారుల ఎత్తు, బరువు కొలతలను తీసుకొని రికార్డుల్లో నమోదు చేశారు. కొలతల్లో తేడాలుండి, పోషకాహార లోపంతో ఉన్న పిల్లలను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఆ పిల్లల ఇంటికి ప్రత్యేకంగా అదనపు ఆహారాన్ని అందించారు. ఇలా నెల రోజులు అందించిన తర్వాత మళ్లీ పిల్లల ఎత్తు, బరువు ఎంత ఉందో సేకరించారు. ఈ వివరాలను అంగన్వాడీ కార్యకర్తలు రికార్డుల్లో పొందుపర్చి అవసరమైన చర్యలు చేపట్టారు. ఫలితంగా పిల్లల్లో పోషకాహార లోపాన్ని 35 శాతానికి పైగా అధిగమించినట్లు అధికారులు చెబుతున్నారు. గత ఆగస్టులో 2,141 మంది పిల్లలను తక్కువ బరువు ఉన్న వారీగా గుర్తించి పోషకాహారాన్ని అందించారు. ఈ నెలాఖరు నాటికి వారి సంఖ్య 1,696కు చేరింది. అలాగే 853 మంది పిల్లలను అతి తక్కువ బరువున్న వారుగా గుర్తించగా.. వారి సంఖ్య 612కు చేరింది. ఈ సంఖ్యను మరో నెల రోజుల్లో జీరో చేయడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తున్నది.
నేటి నుంచి ‘పోషక పాత్ర’
పోషకాహార లోపం ఉన్న పిల్లలను ఆరోగ్యవంతులుగా చేసేందుకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, కలెక్టర్ ఆదేశాలతో రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా నిర్మల్ జిల్లాలో ‘పోషక పాత్ర’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ, ఐసీడీఎస్ల సమన్వయంతో ఈ నెల 3న లాంఛనంగా ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రమంతటా పోషణమాసం ముగిసినా.. నిర్మల్ జిల్లాలో మాత్రం పిల్లలందరూ ఆరోగ్యవంతులైన తర్వాతే పోషణమాసం ముగిసినట్లుగా భావిస్తాం.
– విజయలక్ష్మి, మహిళా శిశు సంక్షేమశాఖ జిల్లా అధికారి, నిర్మల్