చావు నోట్లో తలపెట్టి సాధించుకున్న స్వరాష్ట్రంలో సబ్బండ వర్గాలను బాగు చేయాలన్నదే సీఎం కేసీఆర్ తపన. ఉచిత కరంటు, రైతుబంధు, దళితబంధు, రైతుబీమా, గొర్రెలు, చేప పిల్లలు ఇలా అనేక పథకాలు అమలు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఒక్కటే.. తెలంగాణలో పుట్టిన ప్రతిబిడ్డా తలెత్తుకొని జీవించాలన్నదే ఆయన ఆకాంక్ష. ప్రధానంగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలైన ఎస్సీ, ఎస్టీలు అంటే కేసీఆర్కు వల్లమాలిన అభిమానం. అందుకే ఓ వైపు దళితబంధు అమలు చేస్తూ పేదోడి బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు. మరోవైపు ఆరు శాతం ఉన్న రిజర్వేషన్లను పది శాతానికి పెంచి గిరిజన వెనుకబాటు తనానికి చరమగీతం పాడే పనికి పూనుకున్నారు. అందుకు అనుగుణంగా 2017 సంవత్సరంలోనే అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు ఆమోదముద్ర వేయలేదు. ఈ మేరకు గురువారం జీవో జారీ చేయడంపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రాపటాలకు పాలాభిషేకం చేసి.. పటాకులు కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. విప్లవాత్మక నిర్ణయం తీసుకున్న కేసీఆర్కు అడవిబిడ్డలు కృతజ్ఞతలు తెలిపారు.
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులు వెనుకబాటుకు గురయ్యారు. ఇప్పటివరకు పాలించిన టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూశాయి. కనీస మౌలిక వసతులైన రహదారులు, డ్రెయినేజీలు, వీధి దీపాలు కూడా ఏర్పాటు చేయలేదు. అడవుల్లో అంధకారంలోనే మగ్గారు. స్వరాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టిసారించారు. గిరిజనాభివృద్ధికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తున్నారు. నిధులు విడుదల చేస్తూ ఉపా ధి, విద్య, వైద్యం, ఉద్యోగ రంగాల్లో రాణించేలా ప్రోత్సహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఉట్నూర్ సమగ్ర గిరిజనాభావృద్ధి సం స్థ(ఐటీడీఏ) ద్వారా గిరిజనుల సంక్షేమానికి ఆర్థిక సాయం అందిస్తున్నారు. ట్రైకార్ రుణాలను పంపి ణీ చేయడంతోపాటు, వ్యవసాయ యంత్రా లు, సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆశ్రమ, ప్రాథమిక పాఠశాలలు, జూనియ ర్, డిగ్రీ కళాశాలను నిర్వహిస్తూ ఉన్నత చదువుల కు చర్యలు తీసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 92 గురుకులాలను ఏర్పాటు చేసి మెరుగైన విద్య ను ఇస్తున్నారు. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలకూ పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే మేడారం, నాగోబా, జంగుబాయి, దండారీ లాంటి గిరిజన జాతరలకు వంద కోట్లు కేటాయిస్తున్నారు. వారి ఆచరాలు, సంప్రదాయాలు కాపాడడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. తమ గ్రామాల్లో తమ పాలన కొనసాగేలా గిరిజన తండాలు, ఆదివాసీ గూడేలను పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. ఆదివాసీ, బంజారాల కోసం ఇటీవలే హైదరాబాద్లో ఆత్మగౌరవ భవనాలను ప్రారంభించారు. గిరిజన రైతుల వ్యవసాయానికి విద్యుత్ సరఫరా, రైతుబంధు, రైతుబీమాతోపాటు ఎన్నో సదుపాయాలు కల్పిస్తున్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు శాతం ఉన్న గిరిజన రిజర్వేషన్లను ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జనాభా ప్రతిపాదికన పది శాతానికి పెంచాలని 2017 సంవత్సరంలో అసెంబ్లీ తీర్మా నం చేసి కేంద్రానికి పంపారు. పార్లమెంట్లో గిరిజన రిజర్వేషన్లు పెంచాలని కోరినా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజన రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ తాజాగా జీవో 33 జారీ చేశారు. నేటి నుంచి రిజర్వేషన్లు అమలు కానుండగా విద్య, ఉద్యోగ, ఇతర రంగాల్లో ప్రయోజనం చేకూరనుంది. రిజర్వేషన్లను పెంచడంపై గిరిజనుల సంబురాలు జరుపుకుంటున్నారు. ఉట్నూర్లో జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథో డ్, గిరిజన సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. బోథ్ మండలంలోని సోనాలలో ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు కుమ్రం భీం విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఖానాపూర్ ఎ మ్మెల్యే రేఖానాయక్ కూడా సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. నిర్మల్ పట్టణంలోని ఆదర్శనగర్ నుంచి మంచిర్యాల చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన బంజారా లంబాడా సంఘ నాయకులు నిర్మల్ చౌరస్తాలో కేసీఆర్, మంత్రి అల్లోల, ఎమ్మెల్యే విఠల్రెడ్డి, రేణానాయక్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎన్టీఆర్ ట్యాంక్ బండ్ వద్ద పటాకలు కాల్చారు.
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 1 : ఎన్నోఏండ్లుగా ఎదురు చూస్తున్న రిజర్వేషన్లపై సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన గిరిజనులకు ఊరటనిచ్చింది. 10 శాతం రిజర్వేషన్ పెంచుతూ జీవో జారీ చేయడం చారిత్రాత్మకం. ఆదివాసులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందనడానికి ఇది నిదర్శనం. విద్య, ఉద్యోగ రంగాల్లో ఈ రిజర్వేషన్లు ఎంతగానో ఉపయోగపడుతాయి. అనేక మంచి పనులు చేస్తూ సీఎం కేసీఆర్ ఆదివాసుల ఆత్మబంధువు అయ్యారు.
– కుమ్ర జంగుబాపు, ఎంపీటీసీ, చించుఘాట్
సిరికొండ,అక్టోబర్ 1 : ఎస్టీ రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయం. పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామని చెప్పిన సీఎం, ఆ మేరకు రెవెన్యూ, అటవీశాఖాధికారులతో సర్వే చేయిస్తున్నారు. కేసీఆర్ మాట ఇస్తే తప్పకుండా నిలబడే వ్యక్తి. ఏదైనా సాధించాలనుంటే అది నెరవేరే వరకూ నిద్రపోరు.
– జాదవ్ ఆనంద్రావ్, ధర్మసాగర్, సిరికొండ
సిరికొండ,అక్టోబర్ 1 : రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇది గొప్ప విషయం. భూములు లేని గిరిజనులకు గిరిజన బంధు ఇస్తామని ప్రకటించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయనన్ని పథకాలను గిరిజనుల కోసం అమలు చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్. గిరిజనులందరూ సీఎం కేసీఆర్కు రుణ పడి ఉంటారు.
– జాదవ్ రోహిదాస్, సుంకిడి, సిరికొండ
ఆదిలాబాద్ టౌన్, అక్టోబర్ 1 : గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ పెంచడం శుభపరిణామం. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. గతంలో ఆదివాసులను పట్టించుకునే నాథుడే లేకుండే. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఆదివాసులకు గౌరవం ఇచ్చి ఆదివాసీ భవన్ ఏర్పాటు చేశాడు. గిరిజన బంధు ప్రకటించి అడవిబిడ్డలకు దేవుడయ్యాడు.
– పంద్రె రాధాకృష్ణ,యువజన నాయకుడు, ఆదిలాబాద్
గిరిజన రిజర్వేషన్లు పెంచాలని ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నాం. అది ఇప్పుడు నెరవేరింది. గతంలో అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఈ విషయమై తీర్మానం కూడా చేశారు. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకున్నారు. 6 శాతం రిజర్వేషన్ సరిపోక గిరిజనులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో 10 శాతం రిజర్వేషన్ ఇవ్వడంతో ఎక్కువ మందికి ఉద్యోగాలు వస్తాయి. వచ్చే నోటిఫికేషన్లలో దీన్ని అమలు చేయాలి. రిజర్వేషన్ పెంచేందుకు కృషి చేసిన మంత్రులు అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే రేఖానాయక్కు మా సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.
– తుకారం, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం, జిల్లా అధ్యక్షుడు , నిర్మల్