ఇంద్రవెల్లి, సెప్టెంబర్ 25 : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి స్ఫూర్తితో గిరి పల్లెలు అభివృద్ధి పథంలో సాగుతున్నాయి. నెలనెలా వస్తున్న నిధులతో సకల సౌకర్యాలు సమకూరుతున్నాయి. శుభ్రమైన డ్రైనేజీలు, తళతళలాడుతున్న రహదారులతో సరికొత్తగా కనిపిస్తున్నాయి. తీరొక్క మొక్కలతో పల్లె ప్రకృతి వనాలు రూపుదిద్దుకున్నాయి. అవెన్యూ ప్లాంటేషన్తో హరిత సొబగులు అద్దుకున్నాయి. నూతనంగా ఏర్పాటు చేసి తుమ్మగూడ గ్రామ పంచాయతీ పల్లె ప్రగతి స్ఫూర్తితో అభివృద్ధి పరుగులు పెడుతున్నది. గ్రామంలో 150 కుటుంబాలకు 800ల మంది జనాభా ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా గ్రామ పంచాయతీలకు మంజూరు చేస్తున్న నిధులతో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేశారు. తుమ్మగూడలో రూ.13లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్డు, రూ. 70వేలతో డంప్యార్డు నిర్మించారు. రూ.3.10లక్షలతో 20 గుంటల స్థలంలో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేసి 2700 మొక్కలు పెంచుతున్నారు. గ్రామీణ ప్రాంతంలోని యువత కోసం క్రీడామైదానం, ఆట పరికరాలు ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలోని మూడు రోడ్లకు ఇరువైపులా వివిధ రకాల మొక్కలు నాటారు. పల్లె ప్రకృతి వనంతో పాటు అవెన్యూ ప్లాంట్ల్లో నాటిన మొక్కల పెంపకం కోసం కొంతమందిని వాచ్అండ్వాడ్గా నియమించి పర్యవేక్షణ చేపడుతున్నారు.
ప్రభుత్వం పల్లె ప్రగతి కింద మంజూరు చేస్తున్న నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పల్లె ప్రకృతి వనంలో 2700 మొక్కలు నాటి పెంచుతున్నాం. రూ.13 లక్షలతో శ్మశాన వాటిక, రూ.2.50 లక్షలతో కంపోస్ట్ షెడ్డు నిర్మించి తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేస్తున్నాం. రూ.70 వేలతో డంప్యార్డు ఏర్పాటు చేశాం. పల్లె ప్రకృతి వనంతో పాటు రోడ్లకు ఇరువైపులా నాటిన మొక్కల రక్షణ కోసం కొంతమందిని వాచ్అండ్వాడ్గా నియమించాం.
-మడావి శేకు, తుమ్మగూడ, సర్పంచ్
పల్లె ప్రకృతి వనంలో నాటిన వివిధ రకాల మొక్కలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. పల్లె ప్రకృతి వనం రక్షణ కోసం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో కొంతమందిని వాచ్అండ్వాడ్గా నియమించాం. మొక్కలకు ప్రతి రోజూ నీరుపోస్తూ కాపాడుతున్నం. ప్రకృతి వనంలోకి పశువులు రాకుండా చుట్టూ కంచెలు ఏర్పాటు చేశాం. నర్సరీ ఏర్పాటు చేసి అందులో అన్ని రకాల మొక్కలు పెంచుతున్నాం.
– మనోజ్కుమార్, గ్రామ పంచాయతీ కార్యదర్శి
గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు సర్పంచ్ మడావి శేకు తెలుసుకొని పరిష్కరిస్తున్నారు. పారిశుధ్య పనులు చేసి గ్రామాల్లో శుభ్రత పాటిస్తున్నారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసి నింరతరం వెలుగులు అందిస్తున్నారు. యువత కోసం ప్రత్యేకంగా క్రీడామైదానం ఏర్పాటు చేశారు. ప్రకృతి వనంలో అన్ని రకాల మొక్కలు పెంచుతున్నారు. టీఆర్ఎస్తోనే గిరిజన గ్రామాల్లో అభివృద్ధి సాధ్యం
-కనక హనుమంత్రావ్, మాజీ ఎంపీటీసీ