బాసర, సెప్టెంబర్ 25 : నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఈ నెల 26 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు జరగనున్నాయి. తొమ్మిది రోజుల పాటు అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఉత్సవాలకు మన రాష్ట్రం నుంచే కాకుండా మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తారు. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, తాగునీరు, ప్రసాద వితరణ, తదితర సౌకర్యాలు కల్పించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వైద్య, పోలీసు, ఆలయ అధికారులు సేవలందిస్తారు. గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఆలయంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలు భక్తులకు సేవలు అందించనున్నట్లు ఆలయ ఈవో సోమయ్య అన్నారు.
శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి ఆలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో, గోపురాలను ప్రత్యేక పూలతో అలంకరించారు. వ్యాసమహర్షి ఆలయాన్ని సైతం తీర్చిదిద్దారు.
సరస్వతీ అమ్మవారికి సోమవారం వేకువజామున అభిషేకం, అలంకరణ అనంతరం వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు శైలపుత్రి, రెండోరోజు బ్రహ్మచారిణి, మూడోరోజు చంద్రఘంట, నాలుగో రోజు కుష్మాండ దేవి, ఐదో రోజు స్కందమాత, ఆరో రోజు కాత్యాయని, ఏడో రోజు కాలరాత్రి, ఎనిమిదో రోజు మహాగౌరి, తొమ్మిదో రోజు సిద్ధిదాత్రి రూపాల్లో సర్వసతీ అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా కురవడంతో బాసర వద్ద గోదావరి నిండుకుండను తలపిస్తున్నది. భక్తులు పుణ్యస్నానాలు చేసేందుకు నది ఒడ్డున ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా నది వద్ద గజ ఈతగాళ్లను కూడా ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో భాగంగా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. ఏఎస్పీ కిరణ్కారే, ముథోల్ సీఐ వినోద్రెడ్డి, బాసర ఎస్ఐ మహేశ్తో పాటు వంద మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారు. ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు.