ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మహిళలు తంగేడు, గునుగు, బంతి, చామంతి, గుమ్మడి తదితర పూలు సేకరించి సిబ్బి, ఇత్తడి పాత్రల్లో బతుకమ్మలను పేర్చారు. గౌరమ్మలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం వేళ ఇంటి వాకిళ్లు, ప్రధాన కూడళ్లలో పెట్టి ఆడిపాడారు. అనంతరం స్థానిక చెరువులు, వాగుల్లో నిమజ్జనం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్కులో అదనపు కలెక్టర్ చాహత్బాజ్బాయి, కలెక్టర్ సతీమణి శ్రీజ పాల్గొని బతుకమ్మ ఆడగా, కలెక్టర్ రాహుల్రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్రావు పాల్గొన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఆదివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మొదటిరోజు మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి, భక్తి శ్రద్ధలతో గౌరమ్మను ప్రతిష్ఠించి పూజలు చేశారు. బతుకమ్మలను ఎత్తుకొని మంగళహారతులతో తరలివచ్చి ప్రధాన కూడళ్ల వద్ద పెట్టి ఆడిపాడారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్ పార్కులో అదనపు కలెక్టర్ చాహత్బాజ్బాయి, ట్రైనీ కలెక్టర్లు, కలెక్టర్ సతీమణి శ్రీజ బతుకమ్మ ఆడారు. కలెక్టర్ రాహుల్రాజ్, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ఐటీడీఏ పీవో వరుణ్రెడ్డి, డీపీవో రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కాగజ్నగర్ పట్టణంలో నిర్వహించిన వేడుకల్లో ఎమ్మెల్యే కోనప్ప సతీమణి రమాదేశి పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని విశ్వనాథ స్వామి ఆలయం, బైపాస్రోడ్లోని తెలంగాణ తల్లి విగ్రహం, హైటెక్సిటీ, రెడ్డి కాలనీ, ఎన్టీఆర్ నగర్, రాంనగర్లో మహిళలు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఒకరినొకరు వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. స్థానిక గోదావరిలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్, ఏసీపీ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.
– ఆసిఫాబాద్/మంచిర్యాల ఏసీసీ, సెప్టెంబర్25