‘సబ్కా సాథ్.. సబ్కా వికాస్.. సబ్కా విశ్వాస్’ పేరిట ఊదర గొడుతున్న కేంద్ర సర్కారు ఆచరణలో మాత్రం విఫలమవుతున్నది. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) పేరిట పేదల నడ్డి విరుస్తున్నది. కిరాణా వ్యాపారులు, వినియోగదారులను కూడా వదలడం లేదు. నిత్యావసర వస్తువులపై పన్ను విధించడంతో కిరాణా వ్యాపారులకు పెట్టుబడి భారం పెరగడంతోపాటు వినియోగదారులపై ధరల ప్రభావం పడుతున్నది. దినసరి కూలీలు ఆహార పదార్థాలు కొనే పరిస్థితి లేదు.
ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి పేదలు కోలుకోకుండా చేసింది. ఇప్పుడు జీఎస్టీ పేరిట చిన్న వ్యాపారులను చితక్కొట్టి, బడా వ్యాపారులకు అందలం ఎక్కించేందుకే దోహద పడుతున్నదని పలువురు ‘నమసే’తో ఆవేదన వ్యక్తం చేశారు. పెంచిన పన్ను రద్దు చేయాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని పేర్కొంటున్నారు.
నిర్మల్, జూలై 26(నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోడీ సర్కారు అమలు చేస్తున్న జీఎస్టీ కిరాణా వ్యాపారాలను కుదేలు చేస్తున్నది. నిత్యావసర సరుకులు పన్ను పరిధిలోనికి రావడంతో ఉప్పు, నూనెలు, బియ్యం, గోధుమ పిండి, పాలు ఇలా అన్ని రకాల ఆహార వస్తువుల ధరలు పెరిగాయి.
ఫలితంగా వినియోగదారులపై ఆర్థిక భారం పడడంతోపాటు కిరాణా వ్యాపారులపై కూడా పెట్టుబడి భారం అధికమవుతున్నది. ధరలు పెరుగుతుం డడంతో ప్రజలు తమకు కావాల్సిన సరుకులను కొనలేని పరిస్థితి నెలకొంది. దినసరి కూలీలు, రైతులతోపాటు సామాన్యులపై కూడా ప్రభావం పడుతున్నది.
జీఎస్టీ కంటే ముందు ఐదు కేజీల గోధుమ పిండి ప్యాకెట్ ధర రూ.230 ఉంటే.. జీఎస్టీ ప్రభావంతో రూ.270కి చేరింది. పప్పుల ధరలు కూడా రూ.80-రూ.90 వరకు ఉండగా.. జీఎస్టీ తర్వాత ఒక్కొక్క కిలోకు రూ.40-రూ.50 వరకు పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. ఆహార సరుకులు కూడా కొనలేని దుస్థితి దాపురించిందని కూలీలు ఆవేదన చెందుతున్నారు. సరుకుల ధరలు పెరిగి వ్యాపారాలు దెబ్బతింటున్నాయని ఆందోళన చెందుతున్నారు.
కేంద్రంలో ఉన్న మోదీ సర్కారు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. 2014లో అధికారంలోకి రాగా.. పేద, మధ్య తరగతి ప్రజలకు చేసిందేమీ లేదు. కేవలం పేదల నుంచి సొమ్మును దోచుకొని అదానీ, అంబానీలకు ధారాదత్తం చేస్తున్నది. చిరు వ్యాపారుల పరిస్థితి మరీ దారుణం. కేంద్రం విధించే జీఎస్టీ, ఆన్లైన్ వ్యాపారం, మాల్స్ ఏర్పాటుతో బిజినెస్ చాలా పడిపోయింది. పెద్ద వ్యాపారాలను మాత్రమే ప్రోత్సహిస్తూ.. చిన్న వ్యాపారులపై మోయలేని భారం వేస్తున్నది. కిరాణా దుకాణాదారులపై పన్నుల విషయంలో బీజేపీ సర్కారు పునరాలోచన చేయాలి.
– చిలమంతుల సంజీవ్, కిరాణా వ్యాపారి, నిర్మల్.
ప్రజలతో కేంద్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తున్నది. ఆహార పదార్థాలపై జీఎస్టీ విధించి పేదల కడుపుకొడుతున్నది. కేవలం బడా వ్యాపారుల కోసమే పనిచేస్తూ పన్నుల పేరిట జనానికి చుక్కలు చూపిస్తున్నది. నిత్యావసరాలపై జీఎస్టీ విధించడం ద్వారా ప్రతి కుటుంబంపై దాదాపు రూ.1000పైగా జీఎస్టీ రూపంలో పన్ను పడే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 80 శాతానికిపైగా పేదలే ఉన్నారు. వారందరికీ కూడా మోయలేని భారమే అవుతుంది. ప్రజల పరిస్థితి ఘోరంగా ఉంటే.. వ్యాపారులను దొంగల్లా చూస్తున్నది. వ్యాపారం లేక వెలవెల పోతుంటే.. మోదీ సర్కారు చేష్టలతో లెక్కలు చేయడానికి అధికం సమయం పోతున్నదని వాపోతున్నారు.
– ఆమెడ శ్రీనివాస్, వ్యాపారి, నిర్మల్.
కేంద్ర ప్రభుత్వం విధించిన జీఎస్టీ కారణంగా అన్ని రకాల సరుకుల రేట్లు పెరిగాయి. ప్రజలు వినియోగించే ప్రతి వస్తువుపైనా జీఎస్టీ ప్రభావం పడింది. గోధుమ పిండి, నూనెలు, పప్పులు, పాలు, పెరుగు ఇలా అన్ని రకాల ఆహార సరుకులపై కూడా జీఎస్టీ వేయడంతో వినియోగదారులు తమకు కావాల్సిన వస్తువులు కొనలేకపోతున్నారు. మా గిరాకీ దెబ్బతిన్నది. పెట్టుబడి భారం పడుతుంది.
– షేక్ మొయినొద్దీన్, కిరాణా వ్యాపారి
నిత్యం ప్రజలు వినియోగించే వస్తువులపై కూడా జీఎస్టీ వేయడంతో వ్యాపారాలు బాగా దెబ్బతిన్నాయి. వినియోగదారులు వస్తువులు కొనేందుకు వెనుకాడు తున్నారు. కరోనా నుంచి ఇంకా వ్యాపారాలు సరిగా కోలుకోనేలేదు. ఇలాంటి సమయంలో మోడీ సర్కారు జీఎస్టీ పేరుతో ఇలా ఇష్టారాజ్యంగా పన్నులు విధించడం దారుణం. రోజు రోజుకీ వ్యాపారం తగ్గిపోతున్నది. మోడీ సర్కారు ఇప్పటికైనా నిత్యావసర సరుకులపై విధించిన జీఎస్టీని వెనక్కితీసుకోవాలి.
-విజయ్, కిరాణా వ్యాపారి
కోటపల్లి, జూలై 26 : కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ పేరిట సామాన్యులపై భారం మోపుతున్నది. రోజు వారీగా ఉపయోగించే వాటిపై పన్నులు వేస్తున్నది. ఇంతకుముందు గిరాకీ బాగానే ఉండేది. నాలుగు రూపాయలు చేతిలో కనిపించేవి. జీఎస్టీతో ధరలు పెరగడంతో షాపునకు వచ్చే వాళ్ల సంఖ్య తగ్గింది. కొవిడ్ దెబ్బతో ఇప్పటికీ కోలుకోలేని మాలాంటి చిరువ్యాపారులపై జీఎస్టీ భారం అదనంగా పడుతున్నది. చాలా ఇబ్బందవుతున్నది.
– చింత సంపత్, కిరాణా వ్యాపారి, కోటపల్లి, మంచిర్యాల జిల్లా