శ్రీరాంపూర్, మే 19: అస్ట్రేలియాలోని అదానీ కంపెనీ నుంచి బొగ్గు ది గుమతికే కేంద్రం దేశీయ పరిశ్రమలపై ఒత్తిడి చేస్తున్నదని, ఇందుకోసం కృత్రిమ కొరత సృష్టించిందని సీఐటీయూ రాష్ర్టాధ్యక్షుడు టీ రాజారెడ్డి పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్లో గురువారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో 12 రాష్ర్టాల్లోని విద్యుత్ సంస్థల్లో బొగ్గు కొరత ఉందన్నారు. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వమేనని ఆరోపించారు.
దేశంలోని ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమలు 250 గనుల కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ అనుమతి కోరుతున్నాయని చెప్పారు. అందులో సింగరేణికి చెందినవి 15 గనులున్నాయని చెప్పారు. వీటికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని ఆరోపించారు. కావాలనే ఈ గనులు ప్రైవేట్ సంస్థలకు వేలం ద్వారా అప్పగించడానికి కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.
ఇప్పటికే 166 గనులు ప్రైవేట్ సంస్థలకు వేలం ద్వారా అప్పగించిందని చెప్పారు. ఏడాదిన్నర దాటినా సదరు ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి ప్రారంభించడం లేదన్నారు. దీనిపై బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ పరిశ్రమలకు ఏడాదికి 900 మిలియన్ టన్నుల బొగ్గు అవసరం ఉంటే, 700 మిలియన్ టన్నులు ఉత్పత్తి అవుతున్నదన్నారు.
ప్రైవేట్ సంస్థలకు కేంద్రం కొమ్ముకాయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని మండిపడ్డారు. వెంటనే బొగ్గు గనుల ప్రైవేటీకరణను విరమించుకొని ప్రభుత్వ రంగ బొగ్గు పరిశ్రమలకు గనులు అప్పగించి ప్రస్తుత సంక్షోభాన్ని అధిగమించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ శ్రీరాంపూర్ ఉపాధ్యక్షుడు భాగ్యరాజ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి చంద్రశేఖర్, సహాయ కార్యదర్శి శ్రీధర్, సుధాకర్, జగన్మోహన్ పాల్గొన్నారు.