సత్ఫలితాలిచ్చిన జ్వర సర్వే
ఇళ్లవద్దే బాధితులకు మందుల కిట్లు
కాలు కదుపకుండా కోలుకున్న గ్రామస్తులు
అండగా నిలిచిన అధికారులు, ప్రజాప్రతినిధులు
20 రోజులుగా ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు
నెన్నెల, మే 30 : నెన్నెల మండలం గొల్లపల్లిలో 354 ఇండ్లు, 1406 జనాభా ఉంది. గతేడాది కరోనాతో ప్రజలు ఆగమాగం అయ్యారు. ఇటీవల గ్రామంలో మొదట ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. అప్పటికే గ్రామంలోని వారంతా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవాలనుకున్నారు. కానీ అప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా జ్వర సర్వే ప్రారంభించింది. ఈ నెల 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు సర్వే నిర్వహించగా, 20 మంది వరకు జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించారు. ప్రభుత్వమే కదిలి వచ్చి ఇంటింటికీ మందులు ఇచ్చిం ది. దీంతో ఆ ఊరి గ్రామస్తులందరూ పక్షం రోజుల్లోనే కోలుకున్నారు.
ఇంటింటి సర్వేతో..
గొల్లపల్లిలో మూడు రోజుల్లో ఆరుగురు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తొలి విడుత ఇంటింటి జ్వర సర్వే చేపట్టింది. సర్పంచ్ శశికళ, ఏఎన్ఎం పద్మ, ఆశ కార్యకర్త, అంగన్వాడీ టీచర్, కార్యదర్శి కలిసి బృందంగా ఏర్పడ్డారు. ఇంటింటికీ వెళ్లారు. జలుబు, దగ్గు, జ్వరం, తలనొప్పి తదితర ఆరోగ్య సమస్యలున్న వారి వివరాలు సేకరించారు. మొత్తం 1200 మంది వివరాలు తెలుసుకున్నారు. ఇందులో ఆరుగురికి కరోనా వచ్చినట్లు, 20 మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు వైద్య ఆరోగ్యశాఖకు నివేదిక అందజేశారు. ఈ మేరకు వైద్య అధికారులు, సిబ్బంది 26 మందికి మందుల కిట్లను పంపిణీ చేశారు. బాధితులు మందులతో పాటు పౌష్టికాహారం తీసుకొని ఎలాంటి దవాఖానలకు వెళ్లకుండానే హోం ఐసొలేషన్లో ఉంటూ రికవరీ అ య్యారు. ఇక ఈ నెల 24, 25వ తేదీల్లో రెండో విడుత ఇంటింటి జ్వర సర్వే చేపట్టింది. ఈ క్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశ కార్యకర్తలతో కూడిన ఒక టీం సర్వే నిర్వహించింది. ఒక్కరికీ కరోనా వైరస్ లక్షణాలు కనిపించలేదు. ప్రస్తుతం ఆ గ్రామం కరోనా రహిత గ్రామంగా నిలిచింది.
ఫలితమిచ్చిన జ్వర సర్వే..
కరోనాను కట్టడి చేసేందుకు ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి జ్వర సర్వే సత్ఫలితాలనిచ్చింది. తొలి విడుత జ్వర సర్వేలో భాగంగా వైద్య బృందాలు ఇంటింటికీ వెళ్లి అనారోగ్యంతో ఉన్న వారి వివరాలు సేకరించారు. కరోనా లక్షణాలున్న వారిని గుర్తించి ఔషధ కిట్లను అందజేశారు. బాధితులు దవాఖానలకు వెళ్లకుండా పక్షం రోజుల్లోనే కోలుకున్నారు.
వైరస్ కట్టడికి చర్యలు తీసుకున్నాం
మా ఊరిలో కరోనా వ్యాప్తి చెందడంతో జనం భయపడ్డారు. దీంతో వైరస్ కట్టడికి అన్ని చర్యలు తీసుకున్నాం. ఎప్పటికప్పుడు పారిశుధ్య సిబ్బందితో వాడలన్నీ శుభ్రం చేయించాం. సోడియం హైపోక్లోరైట్ పిచికారీ చేయించాం. బావులు, నీటిపంపుల వద్ద బ్లీచింగ్ పౌడర్ చల్లించాం. ఇంతలో ప్రభుత్వం ఇంటింటి జ్వర సర్వే చేపట్టింది. తొలి విడుత జ్వర సర్వేలో ఆరుగురికి కరోనా సోకింది. 20 మంది జ్వరంతో బాధపడుతున్నట్లు గుర్తించి వైద్య సిబ్బంది మెడికల్ కిట్లు ఇచ్చారు. వాటిని ఎలా వాడాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది వివరించాం. వైద్యసిబ్బంది, అధికారుల సూచనలు పాటించాం. అందరూ కోలుకున్నరు. రెండో విడుత సర్వేలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇందుకు సంతోషంగా ఉంది.