కరోనా కాలంలో చూపిన చొరవకు అభినందన
మంత్రివర్గ సమావేశంలో ప్రత్యేకంగా కితాబు
జిల్లాలో చేపట్టిన చర్యలను వివరించిన అజయ్
ఖమ్మం, మే 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ను సీఎం కేసీఆర్ను ప్రశంసించారు. ఆదివారం ప్రగతిభవన్లో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో లాక్డౌన్ విషయం గురించి మంత్రి అజయ్ను సీఎం కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. తొలుత ఆర్టీసీ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కేటాయింపు, భద్రాద్రి జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు నిర్ణయం వంటి విషయాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. కాగా.. పజా అవసరాల కోసం క్టిష్ట సమయంలో కష్టపడి పని చేస్తున్నారంటూ అజయ్కి సీఎం కితాబిచ్చారు. తన కేబినెట్లో సమర్థవంతమైన మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారంటూ అభినందనలు తెలిపారు. కరోనా కష్ట సమయంలో వైద్య సేవలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఇంజెక్షన్ల పేరిట దోపిడీలకు పాల్పడుతున్న వ్యక్తులపై ఉక్కుపాదం మోపామని, జిల్లాలో ఆక్సిజన్ కొరత ఏర్పడకుండా ఐటీసీతో చర్చించి ప్రతిరోజూ 5 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను అందుబాటులోకి తెచ్చామని వివరించారు. ప్రతిరోజూ 1100 రెమ్డిసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచడం, ముందుచూపుతో చిన్న పిల్లల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం వంటి అంశాలపై మంత్రి పువ్వాడపై సీఎం కేసీఆర్ ప్రశంసలు జల్లు కురిపించారు. అలాగే ఆంధ్రాతో సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి నియోజకవర్గాల్లో వైద్యాధికారులను అప్రమత్తం చేయాలని కేబినెట్లో నిర్ణయించారు.
250 కాన్సన్ట్రేటర్ల వితరణ
ఇండియన్ ఫ్రెండ్స్ ఆఫ్ అట్లాంటా, పువ్వాడ ఫౌండేషన్ సంయుక్తంగా సమకూర్చిన రూ.2.5 కోట్ల విలువైన 250 ఆక్సీజన్ కాన్సన్ట్రేటర్లను మంత్రి అజయ్కుమార్ ఆదివారం హైదరాబాద్లోని ప్రగతిభవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్కు అందించారు. వాటిని ఆవిష్కరించిన అనంతరం అజయ్ను సీఎం అభినందించారు. ఈ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రుల్లోని పేదల కోసం వినియోగించనున్నట్లు మంత్రి తెలిపారు. అమెరికా నుంచి ఈ కొత్త కాన్సన్ట్రేటర్లను దిగుమతి చేసేందుకు సునీల్ చావలి సహకరించినట్లు మంత్రి తెలిపారు.