పథకాల అమలులో మనమే నంబర్వన్
నియోజకవర్గంలో 1300 ఇండ్ల నిర్మాణం
చెక్డ్యాంల నిర్మాణంతో బీడు భూములు సాగులోకి..
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
దేవరకద్ర రూరల్, జూలై 29 : పేదల సంక్షేమమే లక్ష్యం గా ప్రభుత్వం పథకాలను అమలు చేస్తున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. చిన్నచింతకుంట మండలకేంద్రంలోని ఉన్నత పాఠశాలలో రూ.60.98లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులు ప్రారంభించి మొక్కలు నాటారు. అలాగే మద్దూర్ గ్రామశివారులోని ఊకచెట్టు వాగులో రూ.8.34కోట్లతో నిర్మించిన చెక్డ్యాం ప్రారంభించారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డితో కలిసి కొత్త రేషన్కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రాష్ట్రంలో అన్నివర్గాల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్నారన్నారు. పథకాల అమలులో మనమే నంబర్వన్ స్థానంలో ఉన్నామన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో 1300 డబుల్బెడ్రూం ఇండ్లు నిర్మించామని, త్వరలోనే మరిన్ని ఇండ్ల నిర్మాణం చేపడుతామన్నారు. వాగుల్లో చెక్డ్యాంల నిర్మాణంతో బీడు భూముల సాగులోకి వస్తున్నాయన్నారు.
వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ సరఫరాతోపాటు సకాలంలో విత్తనాలు, ఎరువులు, రైతుబంధుతో పం ట పెట్టుబడి సాయం అందిస్తున్నదన్నారు. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నదన్నారు. రైతుబీమాతో అన్నదాతలకు భరోసాగా నిలిచిందన్నారు. త్వరలోనే కురుమూర్తిస్వామి గుట్టపైకి వాహనాలు వెళ్లేందుకు రూ.41కోట్లతో రహదారి నిర్మాణానికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గ్రామానికి రోడ్డు మంజూరైందని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా ఆలయ ప్రహరీ నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక ఇతర పార్టీల నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలే వారికి గణపాఠం చెబుతారన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ హర్షవర్ధన్రెడ్డి, జెడ్పీటీసీ రాజేశ్వరి, సర్పంచులు మోహన్గౌడ్, అంజనమ్మ, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సురేందర్రెడ్డి, ఉమామహేశ్వర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోట రాము, తాసిల్దార్ సువర్ణరాజు, ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.