కరీంనగర్, జూన్ 29 (నమస్తే తెలంగాణ): రేపటి నుంచి నిర్వహించే పల్లెప్రగతి కార్యక్రమంతో గ్రామాల్లో స్పష్టమైన మార్పు కనిపించేలా పనులు చేపట్టాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో పల్లెప్రగతి, హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పల్లె ప్రగతిలో ప్రజలను భాగస్వాములను చేస్తూ ప్రజాప్రతినిధుల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. పల్లె ప్రగతి మొదటి రోజు గ్రామ ప్రగతి నివేదికలు చదివి వినిపించాలన్నారు. పది రోజులు చేపట్టిన పనులను యాప్లో పొందుపరచాలని, గ్రామం, మండలం వారీగా నిర్వహించిన పనులపై నివేదికలు ఎప్పటికప్పుడు ఇవ్వాల్సిన బాధ్యత ఎంపీడీవోలదేనని స్పష్టం చేశారు. పల్లెప్రగతిలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, అధికారులు పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత ఎంపీడీవోలు, పంచాయతీ కార్యదర్శులదేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలని సూచించారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు ఆకస్మికంగా మండలాలు, గ్రామాల వారీగా పనులను పరిశీలిస్తారని, అధికారులు నిర్లక్ష్యం చేయకుండా పూర్తి స్థాయిలో చేపట్టాలని ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యాంప్రసాద్లాల్, జడ్పీ సీఈవో రమేశ్, డీఆర్డీవో శ్రీలతారెడ్డి, డీపీవో వీరబుచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.
పుస్తకావిషరణ
విద్యానగర్, జూన్ 29: జిల్లా సమగ్ర సమాచారంతో ముద్రించిన జిల్లా గణాంక-2020 పుస్తకాన్ని మంగళవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ శశాంక ఆవిషరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జాతీయ గణాంక దినోత్సవం సందర్భంగా జిల్లా గణాంక-2020 పుస్తకాన్ని ఆవిషరించడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా ముఖ్య ప్రణాళికాధికారి, సిబ్బందికి కలెక్టర్ జాతీయ గణాంక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం గణాంకభవన్లో జాతీయ గణిత దినోత్సవం నిర్వహించారు. రెండో పంచవర్ష ప్రణాళికా సంఘం సభ్యుడు పీసీ మహలనోబిస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య ప్రణాళికాధికారి కొమురయ్య, గణాంకాధికారి రాందత్తరెడ్డి, సహాయ గణాంకాధికారులు శ్రీనివాస్, సంపత్కుమార్, జ్యోతి, రామకృష్ణ, సైంటిస్ట్ అరుందతి, అకౌంటెంట్ కృష్ణమూర్తి, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.