పెద్దపల్లి జంక్షన్, మే 29: మాతృత్వం ఓ వరం.. అలాంటి సమయంలో గర్భిణులు, పాలిచ్చే తల్లులకు ఎన్నో సందేహాలు, అనుమానాలు తలెత్తుతాయి. కరోనా సమయంలో వారు ఎవరిని సంప్రదించాలో, ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. ఈ మేరకు 24 గంటలు అందుబాటులో హెల్ప్లైన్ నంబర్ 1800 -59912345, టెలీ కన్సల్టేషన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది.
జాగ్రత్తలు, పౌష్టికాహారంపై అవగాహన
గర్భం దాల్చిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారం ప్రాముఖ్యతపై గైనకాలజిస్టు వైద్యులు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా అవగాహనతో పాటు కొవిడ్ సంబంధమైన సలహాలు పొందేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్లను సంప్రదించాలి. గైనకాలజిస్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి. నెలవారి చెకప్, ప్రసవ సంబంధిత సేవలకు పీవో-ఎంసీహెచ్/ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్ వైజర్లను మొబైల్ ద్వారా సంప్రదించాలి. అత్యవసరమైతే 108కి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ప్రభుత్వ దవాఖానకు వెళ్లవచ్చు.
మాతా శిశు సంరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో గర్భిణులు, బాలింతలు సందేహాలు, అనుమానాలను తీర్చుకునేందుకు హెల్ప్లైన్ ఏర్పాటు చేశాం. అలాగే ప్రతి పీహెచ్సీకి సూపర్వైజర్ కేటాయించాం. వారిని మొబైల్ ద్వారా సంప్రదించి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అవసరమైతే గైనకాలజిస్టు సంప్రదించవచ్చు. గర్భిణి, మాతాశిశు సంరక్షణ కోసం ప్రభుత్వం అందించే సేవలను సద్వినియోగం చేసుకోవాలి.