ప్రభుత్వ దవాఖానల్లో అందుబాటులో బెడ్లు, ఆక్సిజన్, ఇంజక్షన్లు అందించేలా చర్యలు
ప్రైవేట్ దవాఖానల్లో స్కానింగ్ రేట్లు తగ్గింపు
మృతదేహాల తరలింపునకు ఉచిత వాహనం ఏర్పాటు
టాస్క్ఫోర్స్ కమిటీతో లాక్డౌన్పై పర్యవేక్షణ
నిర్మల్ అర్బన్, మే 29 : పేద, మధ్య తరగతి ప్రజలు కరోనా వైరస్ బారిన పడి చికిత్స కోసం ప్రైవేట్ దవాఖానల్లో చేరి ఆర్థికంగా చితికిపోతున్నారు. మరి కొందరు వైరస్తో పోరాడి మృతి చెందుతున్నారు. ఒక్కో కుటుంబంలో ముగ్గురు కూడా మృతి చెందిన ఘటనలున్నాయి. ఇలాంటి ఆపత్కాలంలో కొవిడ్ బాధితులకు రాష్ట్ర దేవాదాయ, అటవీ, పర్యావరణ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అండగా నిలుస్తున్నారు. రోగులకు ప్రభుత్వ దవాఖానల్లోనే మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రైవేట్ దవాఖానల్లో ఫీజుల నియంత్రణ, సీటీ స్కానింగ్ ఫీజును యాజమాన్యాలతో చర్చలు జరిపి తగ్గించారు. లాక్డౌన్ అమలు తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులతో మాట్లాడి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన సౌకర్యాలకు కృషి..
ప్రైవేట్ దవాఖానలకు వెళ్లలేని పేదల కోసం జిల్లాల్లోని ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేలా కృషి చేశారు. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ దవాఖానలో 105 బెడ్లలో 95 సాధారణ బెడ్లు, 10 ఆక్సిజన్ యూనిట్లతో ఉన్న బెడ్లు ఏర్పాటు చేయించారు. ఆక్సిజన్, రెమ్డెసివర్ ఇంజక్షన్లు, తదితర సదుపాయాల కోసం నిజామాబాద్, హైదరాబాద్కు రెఫర్ చేయకుండా ఇక్కడే మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. నిజామాబాద్ నుంచి ప్రతి రోజూ ప్రభుత్వ దవాఖానకు 20 ఆక్సిజన్ సిలిండర్లను అందేలా చర్యలు తీసుకున్నారు. అత్యవసర సమయంలో రోగులకు అందించే రెమ్డెసివర్ ఇంజక్షన్లను సైతం దవాఖానలో ఉంచేలా చర్యలు తీసుకున్నారు. మంత్రి చొరవతో ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందిన 99 శాతం రోగులు కోలుకుని క్షేమంగా ఇంటికి చేరుకుంటున్నారు.
ప్రైవేట్ దవాఖానల్లో ఫీజుల తగ్గింపు..
వ్యాధి తీవ్రతను బట్టి కొందరికి సీటీ స్కానింగ్ చేయాల్సి వస్తున్నది. సీటీ స్కానింగ్ ఫీజు గతంలో రూ.4500 ఉన్నది. ల్యాబ్లు, ప్రైవేట్ దవాఖానల యాజమాన్యాలు, వైద్యులతో మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సమావేశం నిర్వహించారు. ప్రైవేట్ దవాఖానలో అందిస్తున్న సేవలు, తీసుకుంటున్న ఫీజులపై ఆరా తీశారు. రోగులకు సేవా భావంతో వైద్యం అందించాలన్నారు. స్కానింగ్ రేట్లను రూ.4500 నుంచి 2500 వరకు తగ్గించాలని సూచించారు. దీంతో ఈ నెల 20 తేదీ నుంచి రూ.2500 మాత్రమే స్కానింగ్ ఫీజును వైద్యులు తీసుకుంటున్నారు. ఫీజు తగ్గించేందుకు కృషి చేయడంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి జిల్లా ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.
కొవిడ్ మృతదేహాలకు ఉచిత వాహనం ఏర్పాటు
కొవిడ్ బారిన పడి చనిపోయిన వారి మృతదేహాలను శ్మశానవాటికకు తరలించేందుకు ప్రైవేట్ వాహనదారులు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకూ వసూలు చేస్తున్నారు. పేదలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కరోనా మృతుల అంత్యక్రియల కోసం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేయించారు. పట్టణంలోని 42 వార్డుల ప్రజలకు ఈ వాహనం అందుబాటులో ఉంచారు. ఇప్పటికే పదుల సంఖ్యలో మృతదేహాలను ఈ వాహనం ద్వారా తరలించి అంత్యక్రియలు చేశారు.
జిల్లాలో టాస్క్ ఫోర్స్ కమిటీతో కరోనా కట్టడికి చర్యలు
ఓ వైపు కొవిడ్ రోగులకు మెరుగైన వసతులు కల్పిస్తూనే మరో వైపు ఉమ్మడి జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ జిల్లాలో లాక్డౌన్ను అమలు తీరును మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ కమిటీతో కరోనా వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో కొవిడ్తో మృతి చెందిన బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ ధైర్యం చెబుతున్నారు. కొవిడ్ బారిన పడిన అధికారులు, నాయకుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు ఫోన్లో తెలుసుకుంటూ ధైర్యం చెబుతున్నారు.