మహబూబాబాద్ జిల్లాలోని ఓ తండాలో దారుణం
నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు
నిందితున్ని కఠినంగా శిక్షించాలి
మహబూబాబాద్ కలెక్టర్, ఎస్పీకి మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశాలు
ఘటనపై మంత్రి ఎర్రబెల్లి సీరియస్
బాధితులకు అండగా ఉంటామని వెల్లడి
మరిపెడ, మే 29 : గిరిజన బాలికపై లైంగికదాడి, ఆపై హత్య ఘటన కలకలం రేపింది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని ఓ గ్రామ శివారు గుట్టపై శనివారం ఈ దారుణం జరిగింది. మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక (17) తల్లి ఇదివరకే చనిపోవడంతో ఆమె పెద్దనాన్న వరుసైన లక్పతి-వసంత ఆమెను పెంచుతున్నారు. బాలిక మరిపెడలోని ఓ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. లాక్డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటూ కూలి పనులకు వెళ్తూ ఇంటికి ఆసరా అయ్యే ది. అయితే ఆమెకు తండా ధర్మారం గ్రామానికి చెందిన ధరంసోత్ రాజేశ్తో పరిచయం ఉంది. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్న సమయంలో రాజేశ్ ఆమెను నమ్మించి గుట్టపైకి తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించడంతో బాలిక ప్రతిఘటించింది. తీవ్ర రక్తస్రావం కావడంతో అపస్మారక స్థితికి చేరుకుంది. బాలిక స్పృహ కోల్పోవడంతో కంగారు పడిన రాజేశ్.. తండాకు చెందిన శ్రీనుతో పాటు మరొకరికి పరిస్థితిని వివరించాడు. ముగ్గురూ కలిసి స్థానిక ఆర్ఎంపీ వద్దకు బాలికను తీసుకెళ్లారు. పరిస్థితి విషమించినట్లు వైద్యుడు చెప్పడంతో వెంటనే మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్కు తరలించగా అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. ఘటనా స్థలాన్ని ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించి బాలిక కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం 376, 302 కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టాల్సిందిగా తొర్రూరు డీఎస్పీ వెంకటరమణను ఆదేశించారు.
బాధితులకు అండగా ప్రభుత్వం..మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు
మరిపెడ : మండలంలోని ఓ తండాకు చెందిన బాలిక లైంగిక దాడి, హత్య ఘటనపై మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వీపీ గౌతమ్, ఎస్పీ కోటిరెడ్డితో మాట్లాడి బాధితులకు తక్షణమే న్యా యం జరిగేలా చూడాలని ఆదేశించా రు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. మృతురాలి కుటుంబానికి తన సంతాపం వెలిబుచ్చారు.