చికిత్స పొందుతూ గంగవ్వ మృతి
జీపీ పాలకవర్గం సాయంతో గ్రామంలో అంత్యక్రియలు
ధర్మారం, మే29: విధి వెక్కిరించింది. ఆపద లో ఉన్న కరోనా బాధితురాలికి మంత్రి కొప్పుల ప్రత్యేక చొరవ తీసుకొని సాయం చేసినా ప్రాణాలు కోల్పోయింది. ధర్మారం మండలం దొంగతుర్తిలో శనివారం జరిగిన ఘటన గ్రామస్తులను కలిచివేయగా, జీపీ పాలకవర్గం అంత్యక్రియలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నది.
వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన గుండ గంగవ్వ, లచ్చయ్య దంపతులకు నలుగురు కూ తుర్లు. అందరికీ వివాహం చేశారు. వారిలో రెండో కూతురు మృతిచెందగా, మిగతా ముగ్గురు వివిధ ప్రాంతాల్లో ఉంటున్నారు. గంగవ్వ భర్త లచ్చయ్య రెండేళ్ల క్రితమే అనారోగ్యంతో మృతిచెందగా, గ్రామంలోని తన ఇంటి (రేకుల షెడ్డు)లో ఒంటరిగానే ఉంటోంది. కూతుళ్లు అప్పుడప్పుడు వచ్చి యోగ క్షేమాలు చూసుకుంటారు. గంగవ్వ (70)కు ఈ నెల 17న కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం, ఆమె ఉన్నది ఒకే రూం కావడంతో కూతుర్లు దగ్గరుండి చూసుకునే పరిస్థితి లేకపోయింది. ఒంటరిగా ఉండడం వల్ల మానసింగా కుంగిపోయింది. అయితే ఇటీవల గ్రామానికి చెం దిన ఫొటో గ్రాఫర్ కొమ్మ పరమేశ్ కరోనా బాధితులకు భోజన సాయం చేస్తున్న క్రమంలో గంగ వ్వ ఆరోగ్య పరిస్థితి క్షీణించిన విషయం తెలుసుకొని సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. దీంతో టీఆర్ఎస్వై మండల ప్రచార కార్యదర్శి సల్వాజి మాధవరావు విషయాన్ని మంత్రి కొప్పుల దృష్టికి తీసుకెళ్లగా, ఆయన స్పందించారు. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి అప్రమత్తం చేయడంతోపాటు 108 వాహనాన్ని గ్రామానికి పంపించారు. అప్పటికే అపస్మార స్థితిలో ఉన్న వృద్ధురాలిని కరీంనగర్ దవాఖానాకు తరలించారు. ఎంపీటీసీ సదయ్య, ఉప సర్పంచ్ చంద్ర శేఖర్, టీఆర్ఎస్వై నాయకుడు సల్వాజి మాధవరావు దగ్గర ఉండి మరీ వృద్ధురాలిని అంబులెన్స్లో ఎక్కించేందుకు సాయం చేశారు. ఉదయం 11 గంటలకు దవాఖానలో చేరిన ఆమె, సాయంత్రం 4 గంటలకు మృతిచెందింది. గంగవ్వ మృతదేహాన్ని కరీంనగర్ దవాఖాన నుంచి రాత్రి అంబులెన్స్లో దొంగతుర్తికి తీసుకువచ్చి, గ్రామ పంచాయతీ పాలకవర్గం సాయంతో గ్రామ శివారులో అంత్యక్రియలు నిర్వహించారు.