కలెక్టర్ కే శశాంక
టవర్ సర్కిల్లో అభివృద్ధి పనుల పరిశీలన
కార్పొరేషన్, మే 29: టవర్సర్కిల్లో స్మార్ట్సిటీ కింద చేపడుతున్న సుందరీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. టవర్సర్కిల్ వద్ద సాగుతున్న సుందరీకరణ పనులను శనివారం ఆయన మేయర్ వై సునీల్రావుతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, డ్రైనేజీల పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు. ఫుట్పాత్లను ఏర్పాటు చేసి ఫెవర్ బ్లాక్ పనులు చేపట్టాలన్నారు. రూపొందించిన డిజైన్ ఆధారంగా టవర్సర్కిల్ చుట్టు ఉన్న భవనాల యజమానులతో మాట్లాడి ఎంక్రోజ్మెంట్ సమస్యలను పరిష్కరించాలన్నారు. టౌన్ ప్లానింగ్ సిబ్బంది కొలతలు వేసి చేసిన మార్కింగ్ ప్రకారం ఆక్రమణలను తొలగించాలన్నారు. దీనికి సంబంధించిన పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఎలక్ట్రిసిటీ అధికారులతో సమన్వయం చేసుకొని ఆర్వీ కాంట్రాక్టర్ టవర్సర్కిల్ ఏరియాలోని విద్యుత్ స్తంభాలను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మాజీ మేయర్, కార్పొరేటర్ రవీందర్సింగ్, కార్పొరేటర్ వంగల శ్రీదేవీపవన్, కమిషనర్ క్రాంతి, నగరపాలక సంస్థ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఓపీ సేవలు ప్రారంభించాలి
విద్యానగర్, మే 29: కరోనా బారిన పడి కోలుకున్న వారికి తదుపరి వైద్య సేవలందించేందుకు వీలుగా జిల్లా ప్రభుత్వ దవాఖానలో పోస్ట్ కొవిడ్ ఓపీ సేవలను ప్రారంభించాలని కలెక్టర్ శశాంక ఆదేశించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం ఆయన జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్, సీనియర్ వైద్యాధికారులు, నోడల్ ఆఫీసర్లతో పోస్ట్ కొవిడ్ వైద్య సేవలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఎంతో మంది కొవిడ్ బారిన పడి కోలుకుంటున్నారని, వారికి తర్వాత వైద్య సేవలందించేందుకు వీలుగా ప్రభుత్వ దవాఖానలో ప్రత్యేక పోస్ట్ కొవిడ్ ఓపీ సేవల సెంటర్ను ప్రారంభించాలని సూపరింటెండెంట్ డాక్టర్ రత్నమాలను ఆదేశించారు. ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రభుత్వ దవాఖానలో కొవిడ్ చికిత్స పొంది కోలుకున్న వారి జాబితా తయారు చేయాలన్నారు. రోగులకు ఇస్తున్న మందులు, ఇంజెక్షన్లు, పరీక్షలు, డాక్టర్ల సందర్శనను కేస్షీట్లో నమోదు చేయాలని సూచించారు. దవాఖానలో రోజుకు మూడు సార్లు పారిశుధ్య పనులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ దవాఖానలో మరో 8 మంది నర్సులను ఔట్ సోర్సింగ్ పద్ధతిలో వెంటనే తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్ఎంవో డాక్టర్ శౌరయ్య, నోడల్ ఆఫీసర్లు సీహెచ్ మనోజ్కుమార్, పులి మధుసూదన్, డాక్టర్లు అలీం, పద్మ, జ్యోతి, కృష్ణప్రసాద్, శ్రీనివాస్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.