చెక్డ్యాంల నిర్మాణంతో ఆయకట్టు సస్యశ్యామలం
త్వరలోనే రూ.51కోట్లతో పేరూర్ లిఫ్ట్ పనులకు టెండర్లు
దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి
దేవరకద్ర రూరల్, జూలై 28 : చెక్డ్యాంల నిర్మాణంతో ఊకచెట్టు వాగు జీవనదిగా మారుతున్నదని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. దేవరకద్ర మండ లం పేరూర్ శివారులోని ఊకచెట్టు వాగులో రూ.5కోట్లతో నిర్మించిన చెక్డ్యాంను జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్రెడ్డి, కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ఎమ్మెల్యే ఆల ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఇప్పటికే 21 చెక్డ్యాంలు నిర్మించామన్నారు. ప్రతి చెక్డ్యాం సుమారు 2 కిలోమీటర్ల మేర నీటితో కళకళలాడటం సంతోషంగా ఉందన్నారు. వాగు పరిసర ప్రాంతంలో భూగర్బజలాలు పుష్కలంగా అభివృద్ధి చెందుతాయని, ఆయకట్టు సస్యశ్యామలంగా మారుతుందన్నారు. పేరూర్ లిఫ్ట్ నిర్మాణానికి రూ.51కోట్లు మంజూరయ్యాయని, త్వరలోనే టెండర్ల ప్రక్రియ పూర్తవుతుందన్నారు. పేరూర్ లిఫ్ట్ పనులు పూర్తయితే 2,500 ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. రైతును రాజు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తున్నదని వివరించారు.
వర్నె వాగులో రూ.24లక్షలతో తాత్కాలిక వంతెన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ రమాదేవి, జెడ్పీటీసీ అన్నపూర్ణ, సర్పంచ్ చామన్కుమార్, ఏఎంసీ చైర్పర్సన్ కొండా సుగుణ, పీఏసీసీఎస్ చైర్మన్ నరేందర్రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు కొండారెడ్డి, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు శివరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ ఈవీ గోపాల్, నాయకులు శ్రీకాంత్యాదవ్, కొండా శ్రీనివాస్రెడ్డి, శ్రీకాంత్, భాస్కర్రెడ్డి, తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో శ్రీనివాస్, నీటిపారుదల శాఖ డీఈ చందూలాల్, ఏఈ శ్రీనివాస్గౌడ్, కాంట్రాక్టర్ కేవీఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.