యాదాద్రి తరహాలో తీర్చిదిద్దుతాం
పనులను వేగంగా పూర్తి చేస్తాం
మంత్రి గంగుల కమలాకర్
ఆలయ విస్తరణ పనులకు భూమి పూజ
కార్పొరేషన్, మే 28: కరీంనగరంలోని రేకుర్తి గుట్టపై ఉన్న స్వయంభూ శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని పర్యాటక క్షేత్రంగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం గుట్టపై ఆలయ విస్తరణ పనులకు మంత్రి భూమి పూజ చేసి, మాట్లాడారు. రూ.2 కోట్లతో ఆలయ గుట్టను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. 1,500 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆలయానికి వెళ్లేందుకు గతంలో గుట్టపైకి కాలిబాట కూడా సరిగ్గా లేదన్నారు. రూ.3.50 కోట్లతో ఘాట్ రోడ్డు పనులు చురుగ్గా సాగుతున్నాయని చెప్పారు. నిధుల కొరత లేకుండా ఆలయ పునర్నిర్మాణం చేసి యాదాద్రి తరహాలో తీర్చిదిద్దడం కోసం మరో రూ.2కోట్లతో పనులు చేస్తున్నామన్నారు. పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని అధికారులను సూచించారు. రేకుర్తి లక్ష్మీనృసింహ క్షేత్రం దేదీప్యమానంగా వెలిగిపోవడం ఖాయమన్నారు. కార్యక్రమంలో మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కార్పొరేటర్లు సుదగోని మాధవీ కృష్ణగౌడ్, బోనాల శ్రీకాంత్, ఎదుల రాజశేఖర్, కొత్తపల్లి జడ్పీటీసీ పిట్టల కరుణ, మాజీ సర్పంచ్ నందెల్లి ప్రకాశ్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.