మల్లాపూర్లో పూర్తయిన వంతెన పనులు
హర్షం వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు
మల్లాపూర్, ఏప్రిల్ 28: మల్లాపూర్ మండలవాసులను ఏళ్లుగా వెంటాడుతున్న హైలెవల్ కష్టాలు ఎట్టకేలకు స్వరాష్ట్రంలో తీరాయి. ప్రతి సంవత్సరం వానకాలంలో కురిసిన వర్షాలతో మండల కేంద్రం శివారులోని బొంగుల ఒర్రె వద్ద ఉన్న లోలెవల్ వంతెన నీటమునిగిపోయేది. దీంతో రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయేవి. స్వరాష్ట్రంలో కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రత్యేక చొరవతో ఎండీఆర్ నిధులు రూ. 2 కోట్లతో హై లెవల్ వంతెన నిర్మాణం, సంబంధిత రోడ్డు నిర్మాణ పనులకు అప్పటి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, నిజామాబాద్ ఎంపీ కవితతో కలిసి శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం హై లెవల్ వంతెన నిర్మాణ పనులు పూర్తి కావడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో మండల ప్రజలు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.