వరంగల్, మే 27 :గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కార్పొరేటర్లు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాను అమలు చేస్తూ పేదలను ఆదుకుంటున్నారని పేర్కొన్నారు.
పేదింటి ఆడబిడ్డలకు భరోసా..
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు భరోసా కల్పిస్తున్నారని 28వ డివిజన్ కార్పొరేటర్ గందె కల్పన అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని మేదరి వాడ, హంటర్రోడ్డు సంతోషిమాత కాలనీల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి సీఎం కేసీఆర్ అందజేస్తున్న లక్షానూటపదహారు రూపాయలు ఎంతో ఆసరా అవుతున్నాయని అన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని వివరించారు. 12 మంది లబ్ధిదారులకు చెక్కులు అందజేశామని కల్పన తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు గందె నవీన్, తోట నవీన్ కుమార్, కొలిపాక శ్రీనాథ్, తుమికి సురేశ్, మందల నర్సింహారెడ్డి, శ్రీపతి శ్రీహరి, బోయిని రవి, బ్రహ్మస్వామి, నాగరాజు, కిరణ్, శంకర్సింగ్ ఠాగూర్, శ్రీరామోజు రంగనాథ్, వీఆర్వో సతీశ్, శ్రావణ్ పాల్గొన్నారు.
నిర్విరామంగా సంక్షేమ పథకాల అమలు
వరంగల్ చౌరస్తా : కరోనాతో దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్విరామంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని గ్రేటర్ 24, 25 డివిజన్ల కార్పొరేటర్లు రామా తేజస్వి, బస్వరాజు శిరీష అన్నారు. గురువారం 24వ డివిజన్ పరిధిలోని మహబూబియా పంజతన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 12 మందికి కల్యాణలక్ష్మి, 10 మందికి షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. 25వ డివిజన్కు సంబంధించిన 17 మందికి కల్యాణలక్ష్మి, 15 మందికి షాదీముబారక్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెళ్లి తల్లిదండ్రులకు భారం కాకూడదని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో 24, 25 డివిజన్ల నాయకులు ఆకుతోట శిరీష్, బస్వరాజు శ్రీమాన్, తోట హరీశ్, పందికొండ శివరాజ్, ఎండీ సద్దాం, తాహేర్, రషీద్, హైమత్, రాహుల్ పాల్గొన్నారు.
ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఆసరా
పోచమ్మమైదాన్ : కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో ఆసరాగా నిలుస్తాయని 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్కుమార్ జోషి అన్నారు. డివిజన్లోని 18 మంది లబ్ధిదారులకు టీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో సైతం సీఎం కేసీఆర్ ఆడపిల్లల తల్లిదండ్రుల ఆర్థిక ఇబ్బందులు గుర్తించి చెక్కులను పంపిణీ చేస్తున్నారని తెలిపారు.
దేశాయిపేట రోడ్డులో…
గ్రేటర్ 12వ డివిజన్ దేశాయిపేట రోడ్డులోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్ కావటి కవిత 21 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను గురువారం అందజేశారు. టీఆర్ఎస్ నాయకులు వనపర్తి శ్రీనివాస్, బసనబోయిన కొమురయ్య, మేకల సమ్మయ్య, టీ రమేశ్, అక్బర్ పాల్గొన్నారు.
సంక్షేమ పథకాలు సద్వినియోగించుకోవాలి
కాశీబుగ్గ : అర్హులు సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేంద్రకుమార్ అన్నారు. కాశీబుగ్గలోని పద్మనగర్ పద్మశాలి భవనంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు. ఎమ్మెల్యే ఆదేశానుసారం చెక్కులు పంపిణీ చేసినట్లు తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలు పేదలకు అండగా ఉంటాయని వివరించారు.