కరోనా కాలంలో ‘స్మార్’్ట సేవలు
వాట్సాప్ ద్వారా పిల్లలకు ఇంటివద్దే పాఠాలు
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన
కృష్ణకాలనీ, మే 27:కరోనా కష్టకాలంలో అంగన్వాడీ సేవలను ప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతలకు అండగా నిలిచేందుకు ఆన్లైన్ ద్వారా కార్యక్రమాలను కొనసాగిస్తున్నది. చిన్నారులు ఇంటిపట్టునే చదువు నేర్చుకునేలా వాట్సాప్ను వినియోగిస్తున్నది. గర్భిణులు, బాలింతలకు ఆరోగ్య సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పౌష్టికాహారంపై స్మార్ట్ఫోన్లలోనే సలహాలు, సూచనలు అందిస్తున్నది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో ఆన్లైన్ విధానాన్ని అమలు చేస్తున్నది. చిన్న పిల్లలు, గర్భిణులు, బాలింతలు బయటికి వెళ్లకుండా ఇంట్లోనే అన్ని రకాల సేవలు పొందేలా ఏర్పాట్లు చేసింది. అంగన్వాడీ కేంద్రాల పరిధిలోని లబ్ధిదారుల వాట్సాప్ నంబర్లు తీసుకొని గ్రూపులు క్రియేట్ చేసి చిన్నారులకు విద్యనందిస్తున్నది. అంగన్వాడీ కేంద్రాల్లో పేర్లు నమోదైన చిన్నారులు ఇంట్లోనే ఆడుతూ, పాడుతూ నేర్చుకునేలా పాటలు, పద్యాలు, ఛాయాచిత్రాలతో కూడిన పాఠాలను తల్లిదండ్రుల ఫోన్లకు అంగన్వాడీ టీచర్లు పంపుతున్నారు. అనంతరం వాటిపై వాట్సాప్లోనే పిల్లలకు అవగాహన కల్పిస్తున్నారు.
గర్భిణులు, బాలింతలకు స్మార్ట్ సేవలు
గర్భిణులు, బాలింతల ఆరోగ్య సమస్యలు, వారు తీసుకునే ఆహారంపై సలహాలు, సూచనలు ఇచ్చే బాధ్యతను ప్రభుత్వం పూర్తిగా అంగన్వాడీ టీచర్లకు అప్పజెప్పింది. గర్భం దాల్చిన నాటి నుంచి తగిన విశ్రాంతితో పౌష్టికాహారం తీసుకునేలా అంగన్వాడీ టీచర్లు అవగాహన కల్పిస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్ నేపథ్యంలో వారికి స్మార్ట్ఫోన్ల ద్వారా సేవలు అందిస్తున్నారు. పోషకాహార లోపం ఉంటే కలిగే దుష్పరిణామాలను పోస్టర్ల మాదిరిగా తయారుచేసి వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ఐరన్ మాత్రలు వేసుకోవడం, పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవడం, క్రమం తప్పకుండా టీకాలు వేసుకోవడం వంటి విషయాలపై స్మార్ట్ఫోన్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు.
వాట్సాప్లోనే సూచనలు
కరోనా సమయంలో చిన్నారులు చదువుకు దూరం కాకుండా ఉండేందుకు ఆన్లైన్ ద్వారా సేవలందిస్తున్నాం. పిల్లల తల్లిదండ్రుల నంబర్లతో వాట్సాప్ గ్రూపు తయారు చేసి పాఠాలు పంపుతున్నాం. అవసరమైనప్పుడు అంగన్వాడీ టీచర్లు చిన్నారుల ఇండ్లకు వెళ్లి అవగాహన కల్పిస్తున్నారు. బాలింతలు, గర్భిణులకు కూడా వాట్సాప్లోనే సలహాలిస్తున్నాం. ఏమైనా సందేహాలుంటే అంగన్వాడీ టీచర్లకు ఫోన్ చేసి నివృత్తి చేసుకుంటున్నారు. ప్రీ స్కూల్ విద్యను ప్రోత్సహించడంలో అంగన్వాడీ కేంద్రాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
-పీ శ్రీదేవి, జిల్లా సంక్షేమాధికారి, జయశంకర్ భూపాలపల్లి