కరోనా బాధితులు, వారియర్స్కు ఆర్థికసాయాల వెల్లువ
నిత్యావసర సరుకుల పంపిణీ
కృష్ణకాలనీ, మే 27 : కరోనా కష్టకాలంలో బాధితులతోపాటు సేవకులకు పలువురు ఆర్థికసాయం అందజేస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్న జర్నలిస్టులకు టీఎస్ఎమ్మార్పీస్ నాయకులు గురువారం అంబేద్కర్ సెంటర్లో కూరగాయలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఎస్ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు నోముల శ్రీనివాస్ మాదిగ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో జర్నలిస్టులు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో 80మంది జర్నలిస్టులకు తమ వంతుగా సాయం అందజేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి రేణుకుంట్ల కొమురయ్య, నాయకులు రేణుకుంట్ల మహేశ్, పుల్ల సతీశ్, సుమన్ పాల్గొన్నారు. అలాగే, భూపాలపల్లిలో లాక్డౌన్ నేపథ్యంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులకు సాయిబాలాజీ దవాఖాన యాజమాన్యం మూడో వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ సెంటర్లో శానిటైజర్లు పంపిణీ చేసింది. దవాఖాన చైర్మన్ శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది ఇమ్రాన్ పాల్గొన్నారు.
పోలీసులకు మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ
కాటారం/మల్హర్ : లాక్డౌన్లో విధులు నిర్వర్తిస్తున్న కాటారం పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బందికి స్థానిక భాగ్యలక్ష్మీ కిరాణ షాపు యజమాని గంగిరెడ్డి లచ్చిరెడ్డి మండల కేంద్రంలో పండ్లు, ఓఆర్ఎస్, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. కార్యదర్శి షగీర్ ఖాన్, ట్రైనీ ఎస్సై శ్రీనివాస్, సిబ్బంది శ్రీను పాల్గొన్నారు. అలాగే, మల్హర్ మండలంలోని కొయ్యూరు పోలీస్స్టేషన్ ఆవరణలో పోలీసులకు కాంగ్రెస్ నాయకుడు లకావత్ సహేందర్ మాస్కులు, పండ్లు పంపిణీ చేశారు. వార్డు సభ్యుడు ఎడ్ల రాము పాల్గొన్నారు.
పారిశుధ్య సిబ్బందికి బియ్యం..
ఏటూరునాగారం : మండల కేంద్రానికి చెందిన కిరాణా యాజమాన్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఆశ వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది, పారిశుధ్య కార్మికులకు 25 కిలోల బియ్యం పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా ఏఎస్పీ గౌస్ ఆలం పాల్గొని మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలకు సేవ చేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో సీఐ కిరణ్కుమార్, సర్పంచ్ ఈసం రామ్మూర్తి, కిరాణ యాజమాన్య సంఘం అధ్యక్షుడు అయూబ్ఖాన్, ప్రతినిధులు మెరుగు స్వామి, చిదిరాల శ్రీనివాస్, కందకట్ల వేణు, సుజావుద్దీన్(సర్కార్), ఖనీ, వెలగందుల మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
చర్చి ఫాదర్లకు సరుకులు..
ఏటూరునాగారం : గాస్పెల్ ఫర్ ట్రైబల్స్ సోషల్ సర్వీసెస్ సొసైటీ ఆధ్వర్యంలో మండలంనిలో చర్చి ఫాదర్లకు నిత్యావసర సరుకుల పంపిణీ చేశారు. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల్లోని 40 మందికి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి చేతుల మీదుగా సరుకులను అందజేశారు. కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు జీ సామ్యేల్, నాగరాజు, లూథర్, చర్చి ఫాదర్లు లూక రాజు, రవీందర్, అబ్రహం, థామస్, శ్రీనివాస్, చిట్టిబాబు పాల్గొన్నారు.