అభివృద్ధిలో బురద రాఘవాపురం ముందంజ
పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
మొక్కల పెంపకంతో పంచాయతీకి కొత్తకళ
ఉత్తమ పంచాయతీ అవార్డు కైవసం
ఏన్కూరు, మే 27 :గతంలో ఆ పల్లెకు వెళ్లాలంటేనే భయపడేవారు. మోకాలిలోతు బురద.. అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా ఉండేది. కనీస వసతులు కరువు. అలాంటి పల్లెలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో సమూల మార్పులు తీసుకొచ్చింది. సీసీ రోడ్ల నిర్మాణంతో బురద సమస్యకు చెక్ పడింది. స్వచ్ఛత దిశగా అడుగేస్తున్న బురద రాఘవాపురం గ్రామంపై ‘నమస్తే’ కథనం. –
బురదరాఘవాపురం నాడు సమస్యలతో సతమతమైంది. ఆగ్రామానికి వెళ్లాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవారు. ఇప్పుడా పల్లె పూర్తిగా మారిపోయింది. పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామంలో అన్ని సౌకర్యాలు ఒనగూరాయి. గ్రామపంచాయతీలో 3కిలో మీటర్ల బీటీ రోడ్డుకు అదనంగా ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులు రూ.48 లక్షలతో సీసీ రహదారులు నిర్మించారు. దీంతో వీధుల్లో బురద సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. ఇంకుడుగుంటలు, మరుగుదొడ్ల నిర్మాణం, పారిశుధ్య చర్యలతో ఉత్తమ పంచాయతీగా అవార్డు కైవసం చేసుకున్నది. గతేడాది కలెక్టర్ ఆర్వీ కర్ణన్ చేతుల మీదుగా సర్పంచ్ బానోత్ కృష్ణప్రియ ఉత్తమ పంచాయతీ అవార్డును అందుకున్నారు.
ఇంటింటికీ శుద్ధజలం..
గతంలో తాగునీటికి అల్లాడిన పల్లెలో.. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ శుద్ధజలం అందుతున్నది. దీంతో గ్రామస్తుల దాహార్తి తీరింది. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలతో గ్రామంలో పచ్చదనం పరుచుకున్నది. రోజూ ట్యాంకర్ ద్వారా నీళ్లు పోయడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. పంచాయతీ ట్రాక్టర్ ద్వారా చెత్త సేకరించి డంపింగ్యార్డ్కు తరలిస్తున్నారు. దీంతో వీధులన్నీ క్లీన్గా మారుతున్నాయి. వీధుల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లడం, దోమల నివారణకు ఫాగింగ్ చేస్తున్నారు. ఫలితంగా గ్రామంలో వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. రూ.7.40 లక్షలతో 285 ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయడంతో రాత్రిళ్లు విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. సుమారు రూ.16 లక్షలతో ఆరోగ్య ఉపకేంద్రం మంజూరైంది. వీటి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. పొలాలకు వెళ్లే దారిలో బుగ్గవాగుపై రూ.10 లక్షలతో కల్వర్టు నిర్మించేందుకు గ్రామసభ తీర్మానం చేసింది. గ్రామంలో రూ.12.50 లక్షల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో వైకుంఠధామం నిర్మించారు. రూ.2.50 లక్షలతో 20 కుంటల స్థలంలో కంపోస్ట్ షెడ్, 1.60 లక్షలతో 20 కుంటల స్థలంలో డంపింగ్యార్డ్ ఏర్పాటు చేశారు. రూ.3.97 లక్షలతో 20 కుంటల విస్తీర్ణంలో నిర్మించిన పల్లె ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతున్నది. 20 కుంటల స్థలంలో వివిధ రకరకాల మొక్కలు నాటారు. ప్రకృతి వనాన్ని సర్పంచ్ బానోత్ కృష్ణప్రియ పర్యవేక్షిస్తున్నారు.
గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక..
గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగుతున్నాం. ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేపడుతున్నాం. గ్రామస్తుల సహకారంతో గ్రామాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నాం.
-బానోత్ కృష్ణప్రియ, సర్పంచ్