రాబోయే తరాలకు ‘గూడెం’ ఆదర్శం కావాలి
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
కొత్తగూడెం, మే 27: ప్రజలందరికీ వైద్యాన్ని అందుబాటులో ఉంచేందుకు రూ.4 కోట్లతో నియోజకవర్గంలో 20 వైద్యారోగ్యకేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెలిపారు. తన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలకు వైద్యం చేరువలో ఉండాలని కొత్తగా వీటిని మంజూరు చేసినట్లు చెప్పారు. కొత్తగూడేన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఈ ఆరోగ్య కేంద్రాల్లో మూడు బెడ్లు ఉంటాయన్నారు. సిబ్బంది అక్కడే ఉండడం కోసం వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 3 వేల నుంచి 5 వేల జనాభా వరకు ఉన్న ప్రాంతాల్లో సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో పది వేల వరకు జనాభా ఉన్న ప్రాంతంలో ఒక సబ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సబ్ సెంటర్లలో అన్ని సౌకర్యాలూ ఉంటాయన్నారు. లక్ష్మీదేవిపల్లి మండలంలో శ్రీనగర్, చాతకొండ, సీతారామపురం, చుంచుపల్లి మండలంలో విద్యానగర్, దన్బాద్ 1, దన్బాద్ 2, బాబూక్యాంపు, త్రీ ఇైంక్లెన్, సెవెన్ ఇైంక్లెన్, పెనుబల్లి, ఆనందఖని, సుజాతనగర్లో సింగభూపాలెం, వేపలగడ్డ, పాల్వంచలో ఇందిరాకాలనీ, పాల్వంచ టౌన్, యానంబైలు, నాగారంలకు ఈ కేంద్రాలు మంజూరయ్యాయని వివరించారు. నిర్మాణాలు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. రామవరంలో గురుకుల పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.75 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, తహసీల్దార్ రామకృష్ణ, వైస్ చైర్మన్ దామోదర్, కౌన్సిలర్లు పరమేశ్ యాదవ్, అంబులు వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.