కలెక్టర్ శశాంక
గంగాధర, రామడుగు, గోపాల్రావుపేట పీహెచ్సీల తనిఖీ
గంగాధర, మే 26: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ శశాంక అధికారులను ఆదేశించారు. గంగాధర పీహెచ్సీని బుధవారం ఆయన తనిఖీ చేశారు. పీహెచ్సీ పరిధిలో వ్యాక్సినేషన్, కరోనా నిర్ధారణ పరీక్షలు, నిల్వ ఉన్న మందుల వివరాలు వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న గ్రామాల్లో ప్రత్యేక నిర్ధారణ శిబిరం నిర్వహించాలన్నారు. గ్రామాల్లో జ్వర సర్వే త్వరగా పూర్తి చేయాలని, గతంలో వ్యాక్సినేషన్ నిర్వహించిన గ్రామాల్లో పాజిటివ్ రేటింగ్ వివరాలను సేకరించాలని సూచించారు. రెండో డోస్ వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలని ఆదేశించారు.
ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ శశాంక నిర్వాహకులను ఆదేశించారు. గంగాధరలో సింగిల్ విండో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో రైతుల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. కేంద్రంలో ఇబ్బందుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ధాన్యం వెంట వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీవో జనార్దన్రెడ్డి, సర్పంచులు వేముల లావణ్య, మడ్లపెల్లి గంగాధర్, మేచినేని నవీన్రావు, అధికారులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
వ్యాక్సినేషన్ కేంద్రాలు అందుబాటులో ఉండాలి
రామడుగు, మే 26: కొవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రాలు ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలని కలెక్టర్ శశాంక అధికారులు, ప్రజాప్రతినిధులను ఆదేశించారు. గోపాల్రావుపేట, రామడుగు పీహెచ్సీల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. వ్యాక్సినేషన్ కేంద్రాల్లో నీడ, కుర్చీలు వేయాలని ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, సర్పంచులకు సూచించారు. పీహెచ్సీల్లో నిర్మించిన ర్యాంపుపై రూప్లాంటి నిర్మాణం చేపట్టాలని వైద్యాధికారులను ఆదేశించారు. గోపాల్రావుపేట, రామడుగు గ్రామాల్లో కొవిడ్ పరీక్షా కేంద్రాలను ఎక్కడ ఏర్పాటు చేశారని అధికారులను కలెక్టర్ అడుగగా, ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రెండు పీహెచ్సీల్లో సేవలు సంతృప్తికరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. తహసీల్దార్ కోమల్రెడ్డి, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, ఎంపీవో సతీశ్రావు, వైద్యాధికారులు బీజీలి శ్రీనివాస్, సురేశ్, వైస్ ఎంపీపీ పూరెల్ల రాజ్గోపాల్గౌడ్, ప్రజాప్రతినిధులు ఉన్నారు.