కరోనాపై అలుపెరుగని పోరాటం
పల్లెల్లో ముమ్మరంగా పారిశుధ్య పనులు
ఇంటింటికెళ్లి బాధితులకు భరోసా కల్పిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు
పంచాయతీల్లో పనులు పర్యవేక్షిస్తున్న కార్యదర్శులు
ఇల్లెందు రూరల్, మే 26;కరోనా సెకండ్ వేవ్ పల్లెలకూ విస్తరించింది. ఎన్నో ఇళ్లను చుట్టుముడుతోంది. ఇటువంటి విపత్కర సమయంలో వెనుకడుగు వేయకుండా పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పనులకు ఆటంకం కలుగకుండా.. కరోనా మహమ్మారి మరింత విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. రక్త సంబంధీకులు వైరస్ బారిన పడినా కనీసం కన్నెత్తి చూడని ప్రస్తుత తరుణంలో విధులను బాధ్యతగా భావిస్తూ ముందడుగు వేస్తున్నారు. కరోనా వేళ అందరూ ఇళ్లకే పరిమితమైతే వారు మాత్రం మొక్కవోని ధైర్యంతో పల్లెబాట పడుతున్నారు. కరోనా బాధితుల ఇళ్లకు వెళ్లి వారిలో మనోైస్థెర్యాన్ని నింపుతున్నారు.
కరోనాపై వారు అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. మనోధైర్యమే ఆయుధంగా మహమ్మారిని మట్టుబెడుతున్నారు. పల్లెల్లో ఎప్పటికప్పుడు పారిశుధ్య చర్యలు చేపడుతూ కార్మికులు కొవిడ్పై యోధుల్లా కత్తి దూస్తున్నారు. వైరస్ ఒంట్లోకి ప్రవేశించినవారికి ప్రజాప్రతినిధులు, అధికారులు భరోసా కల్పిస్తున్నారు. కరోనా విజృంభిస్తున్నప్పటికీ అభివృద్ధి పనులకు ఆటంకం కలగకుండా.. కూలీలకు ‘ఉపాధి’ కల్పిస్తూ.. వైరస్ కట్టడిపై కార్యదర్శులు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. విపత్కర సమయంలోనూ వెనకడుగు వేయకుండా పంచాయతీల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, కార్యదర్శులు, పారిశుధ్య కార్మికులు అందిస్తున్న సేవలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం. – ఇల్లెందు రూరల్, మే 26
అలుపెరుగని పారిశుధ్య కార్మికులు..
ఇంటి నుంచి కాలు బయటపెట్టేందుకు జంకుతున్న ఈ పరిస్థితుల్లో గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్మికులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. పగలనక, రాత్రనక అలుపెరుగకుండా శ్రమిస్తున్నారు. చెత్తను ఊడ్చడం మొదలుకొని దానిని తరలించడం, రసాయనాలను వీధుల్లో చల్లడం వంటి పనులు చేస్తూ గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. వ్యాధులు, వైరస్లు ప్రబలకుండా బ్లీచింగ్ చల్లుతున్నారు. కరోనా సోకిన వారి ఇళ్లకు వెళ్లి ధైర్యంగా శానిటైజేషన్ చేస్తున్నారు. వైరస్ మరొకరికి వ్యాపించకుండా అదుపు చేస్తున్నారు. కరోనా తగ్గుముఖం పట్టడంలో వారి సేవలు అసమాన్యమవుతున్నాయి. కరోనా భయం లేకుండా వారు పనిచేస్తుండడంతో ప్రభుత్వం వారిని కరోనా వారియర్స్గా గుర్తించింది.
ఆపద బతుకులకు ఆత్మీయ స్పర్శలు..
పాజిటివ్ నిర్ధారణ అయిందనే విషయం తెలియగానే బంధుమిత్రులూ ముఖం చాటేస్తున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ‘మేమున్నాం’ అంటూ.. గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులు, ఎంపీటీసీలు ముందుకొస్తున్నారు. కరోనా సోకిన వారి ఇళ్ల వద్దకు వెళ్లి వారితో మాట్లాడి మనోధైర్యం కల్పిస్తున్నారు. హోం క్వారంటైన్లో ఉన్న వారిలో పేదలను గుర్తించి వారికి పదిహేను రోజులపాటు అవసరమైన నిత్యావసర సరుకులను అందజేస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్లడంలో మానవత్వం ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ప్రజాప్రతినిధులు వారికి తోడవుతున్నారు. బాధితులెవరైనా మరణించిన సందర్భంలో కుటుంబ సభ్యులు ధైర్యం కోల్పోకుండా ‘మేమున్నాం’ అంటూ అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
నిరంతర శ్రామికులుగా పంచాయతీ కార్యదర్శులు..
పల్లెల్లో పారిశుధ్య పనులు నిరంతరం కొనసాగిస్తూ, కూలీలకు ఉపాధి పనులు కల్పిస్తూ, ప్రభుత్వ పథకాలకు ఆటంకం కలుగకుండా చర్యలు చేపడుతూ.. కరోనా మహమ్మారి కట్టడి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు పంచాయతీ కార్యదర్శులు. తెల్లవారుజామునే ఉపాధి కూలీలకు పనులు కల్పిస్తూ విధులను ప్రారంభిస్తున్న కార్యదర్శులు.. ఆ వెంటనే మల్టీపర్పస్ వర్కర్లతో గ్రామాల్లో పారిశుధ్య పనులు చేయిస్తున్నారు. కరోనా బారిన పడిన కుటుంబాలను గుర్తించి వారి ఇళ్లకు వెళ్లి పారిశుధ్యాన్ని పరిశీలించడం, బ్లీచింగ్ చల్లించడం, రసాయనాలను పిచికారీ చేయించడం వంటివి చేస్తున్నారు. వీటితోపాటు నర్సరీల నిర్వహణ, సంక్షేమ పథకాల అమలు వంటి ఇతర విధుల్లోనూ తలమునకలవుతున్నారు. సర్పంచ్ల సహకారంతో గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ను పర్యవేక్షిస్తున్నారు. సెకండ్ వేవ్ ఉధృతి సమయంలోనూ కరోనా సోకని పల్లెలు ఉన్నాయంటే అందులో కీలకపాత్ర కార్యదర్శులదే. ఇక గ్రామాల్లో మాస్కు లేకుండా వీధుల్లోకి వచ్చే వారి వద్దకు వెళ్లి దండం (నమస్కారం) పెట్టి మరీ జాగ్రత్తలు సూచిస్తున్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు కృషి చేస్తున్నారు. కరోనా మృతుల అంత్యక్రియల్లోనూ భాగస్వాములవుతున్నారు.
సమన్వయంతో సత్ఫలితాలు
పల్లెల్లో ప్రజాప్రతినిధులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు సమన్వయంతో ఉండేలా నిరంతరం పర్యవేక్షిస్తున్నాం. ప్రభుత్వ పథకాలకు ఆటంకం కలుగకుండా సమర్థవంతంగా విధుల్లో భాగస్వాములను చేస్తూనే కరోనాపై అలుపెరగని పోరాటం చేసేలా పంచాయతీలను తీర్చిదిద్దుతున్నాం.
-అరుణ్గౌడ్, మండల పంచాయతీ అధికారి,ఇల్లెందు మండలం
వేకువజామునే పల్లెలకు వెళ్తున్నాం..
పంచాయతీల్లో పారిశుధ్య పనుల నిర్వహణ సరిగా జరిగితేనే పరిశుభ్రత సాధ్యమవుతుంది. ఆ పనుల పర్యవేక్షణకు వేకువజామునే పల్లెలకు వెళ్తున్నాం. మాస్కు ధరించడం, భౌతికదూరం పాటించడం వంటివాటిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. వీటితోపాటు ఈజీఎస్, నర్సరీల నిర్వహణ వంటి పనులకూ ఆటంకం కలుగకుండా ముందుకు సాగుతున్నాం.
-వంశీకృష్ణ, పంచాయతీ కార్యదర్శి, చల్లసముద్రం