సత్తుపల్లి, సెప్టెంబర్ 25 : తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, టీఆర్ఎస్ ప్రవాహంలో ప్రతిపక్షాల పాత్ర నీటిచుక్కంత అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం స్థానిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్హాల్లో జరిగిన నియోకజవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మండల, గ్రామకమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్న వారిని ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ స్వరాష్ట్రం సాధించేందుకు కేసీఆర్ ఎంతో కష్టపడ్డారని, దానికి అనుగుణంగా ప్రతిఒక్కరూ పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కష్టపడి పార్టీ, ప్రభుత్వం చేస్తున్న పథకాలను ప్రజల్లోకి విరివిగా తీసుకోవాలని, ప్రతికార్యకర్త సైనికుల్లా పనిచేసి టీఆర్ఎస్ అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలు కులాల మధ్య చిచ్చుపెడుతూ పబ్బం గడుపుకుంటున్నాయని, ధాన్యం కొనుగోలు విషయంలో దొడ్డు ధాన్యాన్ని కేంద్రం కొనడం లేదని చెబితే రైతుల పక్షాన మాట్లాడేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ వెళ్లారన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ, మండల శాఖ కార్యవర్గాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, కనగాల వెంకట్రావు, పాల వెంకటరెడ్డి, పాలెపు రామారావు, రెడ్డెం వీరమోహన్రెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేద కుటుంబాలకు ఆసరా సీఎంఆర్ఎఫ్..
సత్తుపల్లి/ సత్తుపల్లిరూరల్, సెప్టెంబర్ 25 : అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రిలో చికిత్స పొందిన పేద, మధ్యతరగతి ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి వరమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శనివారం స్థానిక క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని 147 మందికి రూ.69 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కూసంపుడి మహేశ్, ఆత్మ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, జడ్పీటీసీ పూసంపూడి రామారావు, పెనుబల్లి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట్రావు, కౌన్సిలర్లు, గ్రామకమిటీ అధ్యక్షుడు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన బేతుపల్లి మాజీ సర్పంచ్ దొడ్డా పుల్లారావు కుటుంబసభ్యులను ఎమ్మెల్యే సండ్ర పరామర్శించారు. ఆయన వెంట ఎంపీపీ హైమావతీశంకర్రావు, సర్పంచ్ శ్రీనివాసరావు, ఆత్మచైర్మన్ హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ రామారావు పాల్గొన్నారు.
చింతకానిలో..
చింతకాని : తిమ్మినేనిపాలెం గ్రామానికి చెందిన కూచిపుడి వెంకటేశ్వర్లుకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి మంజూరైన రూ.55 వేల చెక్కును కాంగ్రెస్ మండలాధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు ఆ గ్రామంలో శనివారం అందించారు. నాయకులు వెంకటేశ్వర్లు, కొండలు, నాగార్జున, బసవయ్య పాల్గొన్నారు.