నిండుకుండలా ఎగువ మానేరు
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో ఆయకట్టుకు నీటి విడుదల
ప్రతిరోజూ సుమారు 100 క్యూసెక్కులు దిగువకు..
22 చెరువులు, కుంటలకు ఊపిరి
వర్షాలు పడకముందే జలకళ
వానకాలం పంటలకు భరోసా
13వేల ఎకరాలకు నీళ్లు
ఆనందంలో ముస్తాబాద్, గంభీరావుపేట మండలాల రైతులు
సిరిసిల్ల, జూన్ 25 :ఎదురెక్కుతూ.. నురగలు కక్కుతూ తరలివచ్చిన కాళేశ్వర గంగతో ఎగువమానేరు పరవళ్లు తొక్కింది. వానలు పడకముందే చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా నిండుకుండలా మారింది. ఇన్నాళ్లూ నీళ్లు లేక భూములను బీళ్లు పెట్టుకొని వలస బాట పట్టిన మెట్ట ప్రాంత రైతాంగం మా‘నీరు’ను చూసి సంబురపడుతున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో ప్రతిరోజూ వంద క్యూసెక్కులు కాలువల ద్వారా వదులుతుండగా, ఆనందపడుతున్నది. ఈ సీజన్లో పంటలకు ఢోకా ఉండదని ధీమాగా చెబుతున్నది.
తుక్కాపూర్ టూ అప్పర్ మానేర్
చరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఎండకాలంలో ఎగువ మానేరు మత్తడి దుంకింది. తుక్కాపూర్ పంప్హౌస్ నుంచి కొండ పోచమ్మ కెనాల్ ద్వారా వెళ్తున్న గోదావరి నీటిని గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద యూఎండీకి జీవనాధారమైన కూడవెళ్లి వాగులోకి వదిలారు. మంత్రి కేటీఆర్ చొరవతో గత మార్చి 31న ఈ నీటిని ఎగువమానేరుకు మళ్లించారు. 31 అడుగుల నిల్వ సామర్థ్యం కల ప్రాజెక్టు ఏప్రిల్ 20న మత్తడి దుంకింది.
వానకాలం పంటలకు భరోసా
చెరువుల్లో నీటి చేరికతో వానకాలం పంటలకు ఢోకాలేదని ఆయకట్టు రైతాంగం భరోసాతో ఉన్నది. వానల కోసం ఎదురుచూడకుండా రైతులు సాగు పనుల్లో నిమగ్నమవుతున్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో నారుమడులను సిద్ధం చేసుకుంటున్నారు. అప్పర్ మానేరు ద్వారా సుమారు 20 వేల ఎకరాల్లోని పంటలకు సాగునీరందనున్నది. ఆయకట్టు పరిధిలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్ మండలాల్లోని దాదాపు 13 వేల ఎకరాలు, చెరువుల పరిధిలోని దాదాపు 2500కు పైగా ఎకరాలు, కాలువల వెంబడి మోటర్ల ద్వారా, పరోక్షంగా దాదాపు 5 వేల ఎకరాలు సాగులోకి రానున్నాయి.
గిట్ల నిండుతయనుకోలె..
మానేరు నీళ్లతో గిప్పుడు గిట్ల చెరువులు నిండుతయని నేననుకోలె. నేను పుట్టి బుద్ధెరిగిన సంది ఎన్నడూ ఇన్ని నీళ్లు చూడలె. గిప్పుడు నీళ్లు వచ్చినయంటే కేసీఆర్ పుణ్యమె. ఎప్పుడూ గీ టైంకు నీళ్లు లేక చెరువులు ఎండిపోతుండె. వానకాలం రాకముందే చెరువులు నిండుతున్నయి. నీళ్లను చూస్తే మస్తు సంబురమైతంది. ఈ సీజన్లో పంటలకు ఇక ఢోకా ఉండది.
చెరువులకు నీటి విడుదల
మంత్రి కేటీఆర్ ఆదేశాలతో నీటిపారుదల శాఖ అధికారులు ఈ నెల 14న ప్రాజెక్టు పరిధిలోని చెరువులను నింపేందుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటిని విడుదల చేశారు. ఎడమ కాల్వ ద్వారా గంభీరావుపేట మండలంలోని రెండు జల వనరులు, కుడి కాల్వ ద్వారా ముస్తాబాద్, గంభీరావుపేట మండలంలోని 20 చెరువులకు నీటిని తరలిస్తున్నారు. మరో 20 రోజుల్లో ఈ చెరువులు పూర్తిస్థాయిలో నిండనుండగా, అమాత్యుడు రామన్న మరోసారి నీటిపారుదల శాఖ అధికారులను సన్నద్ధం చేశారు. ప్రాజెక్టు పరిధిలోని ప్రతి ఎకరాకూ నీరందించాలని ఈ నెల21న ఆదేశించారు. ఆ మేరకు నీటిని విడుదల చేశారు. ప్రతిరోజూ సుమారు 100 క్యూసెక్కులను వదులుతున్నారు. జూలై రెండో వారంలోగా చెరువులన్నింటినీ నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
చెరువులు నిండుతుంటేసంతోషంగున్నది..
పోత్గల్లోని మా కొండ చెరువులకు మానేరు కాలువ ద్వారా నీళ్లు వత్తుంటే ఎంతో సంబురమనిపిస్తంది. ఎప్పుడు పంటలేసినా పంట చివరి వరకు నీళ్లు అందక ఎండిపోయేటియి. కానీ, సీఎం కేసీఆర్ మానేరును గోదావరి నీళ్లతో నింపుడు జెయ్యవట్టి యాసంగి పంటలు మంచిగ పండినయ్. గిప్పుడు వానకాలం పంటలకు కూడా ఢోకా లేదనే ధైర్నమచ్చింది.