రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా నిర్మాణాలు
96 పూర్తి, సాగుతున్న 102 ఇండ్ల పనులు
ఇండ్ల నిర్మాణాలకు గ్రామాల్లో స్థలాలను కేటాయించండి
అధికారులకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఆదేశాలు
భూపాలపల్లి రూరల్, జూన్ 25 : జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని చెంచులకు రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా 520 ఇండ్లు నిర్మిస్తున్నారు. వీటిలో 90 నిర్మాణాలు పూర్తికాగా మరో 102 ఇండ్ల పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. కాగా, కొన్ని గ్రామాల్లో స్థలంలేక పనులు మొదలు కాలేదు. దీంతో శుక్రవారం రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ సభ్యులు శుక్రవారం కలెక్టర్ కృష్ణ ఆదిత్యను కలిశారు. సందర్భంగా వారు మాట్లాడుతూ చెంచు కుటుంబాలకు ఉచితంగా 520 ఇండ్లు నిర్మించి ఇవ్వాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటికే 96 ఇండ్ల నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు. 102 ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయన్నారు. చిట్యాల మండలం శాంతినగర్లో 14 ఇండ్ల నిర్మాణానికి స్థలం సేకరించామని, మరో ఆరు ఇండ్ల నిర్మాణానికి స్థలం కేటాయించాలని కలెక్టర్ను కోరారు. జిల్లాల్లో గల చెంచులకు పూర్తి స్థాయిలో ఇండ్లను నిర్మించి ఇచ్చేందుకు అవసరమైన గ్రామాల్లో స్థలాలను కేటాయించాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండు జిల్లాల్లో నిరుపేదలైన చెంచులకు ఉచితంగా పక్క గృహాలను నిర్మించేందుకు ముందుకు వచ్చి ఇప్పటికే 96 ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి వారికి అందించినందుకు జిల్లా తరపున కృతజ్ఞతలు తెలిపారు.
చెంచుల అభివృద్ధిలో భాగం పంచుకుంటుణ్న ఆర్టీటీ వారికి తప్పకుండా జిల్లా అధికార యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని అన్నారు. వెంటనే చిట్యాల తహసీల్దార్తో ఫోన్లో మాట్లాడి శాంతినగర్లో అవసరమైన ఆరు గృహాలకు స్థలాన్ని వెంటనే కేటాయించాలని ఆదేశించారు. అలాగే గణపురం మండల కేంద్రం, గాంధీనగర్, రవినగర్, కొండంపల్లి, గొల్లపల్లి, పాపయ్యపల్లిలో నిర్మాణాలను త్వర గా పూర్తి చేసేందుకు సహకరిస్తామని, విద్యుత్, మిషన్ భగీరథ నీటి సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. గణపురంలో నిర్మిస్తున్న చెంచుల గృహాల వద్ద కమ్యూనిటీ హాల్, ఆర్డీటీ సంస్థ ఫీల్డ్ ఆఫీస్ నిర్మాణాలను చేపట్టాలని, ములుగు జిల్లాలో చెంచులతో పాటు గోవిందరావుపేటలోని యానాది గిరిజనులు కొనుగోలు చేసుకుంటున్న ఇంటి స్థలాల్లో ఇండ్లను నిర్మించేందుకు అనుమతులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆ మండల తహసీల్దార్ను ఫోన్ ద్వారా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా గణపురానికి చెందిన లబ్ధిదారులకు గృహాల కేటాయింపు పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గణపురం తహసీల్దార్ కృష్ణ చైతన్య, డీపీఆర్వో రవికుమార్, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ రీజినల్ డైరెక్టర్ షణ్ముఖరావు, కో-ఆర్డినేటర్ మారుతి, హనుమంతు, గణపురం ఆర్ఐ సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.