మార్గదర్శకాలు జారీ చేసిన సీఎండీ
మొదటి సారి ఆర్టీజన్లకు స్థాన చలనం
హర్షం వ్యక్తం చేస్తున్న సంస్థ ఉద్యోగులు
మామిళ్లగూడెం, జూన్ 25 : తెలంగాణ ఉత్తర విద్యుత్ పంపిణీ సంస్థలో ఉద్యోగుల బదిలీ జాతర ప్రారంభమైంది. ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలను శుక్రవారం సంస్థ సీఎండీ అన్నమనేని గోపాల్రావు విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా సర్కిల్ కార్యాలయంతో పాటు వివిధ డివిజన్ కార్యాలయాల పరిధిలో పనిచేస్తున్న క్షేత్ర స్థాయి ఉద్యోగులు, కార్యాలయంలో ఉద్యోగులను బదిలీ చేయాలని సంస్థ నిర్ణయించింది. దీంతో సంస్థలో 15 నుంచి 20 ఏళ్లుగా ఆర్టీజన్లుగా పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేయాలని మొదటి సారి నిర్ణయం తీసుకుని మార్గదర్శకాలు విడుదల చేశారు. సబ్ ఇంజినీర్, జేఏవో, సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ కింది స్థాయి ఉద్యోగులకు బదిలీ కానుంది. ఒకే స్థానంలో మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న వారు బదిలీ అవుతారు. సబ్ ఇంజినీర్లు, అకౌంట్స్ విభాగం ఉద్యోగులు, ఫోర్మెన్, ఎస్ఎల్ఐ, ఇతర సిబ్బందిని సర్కిల్ సూపరిండెంట్ ఇంజినీర్ (ఎస్ఈ)కి బదిలీ చేసేందుకు క్షేత్రస్థాయి ఉద్యోగులు, లైన్ ఇన్స్పెక్టర్లలను డివిజనల్ ఇంజినీర్స్ బదిలీ చేయనుంది. సాధారణ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేశారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులకు ప్రాధాన్యతను ఇచ్చారు. క్యాడర్ స్ట్రెంత్ ప్రకారం 50శాతం ఉద్యోగులకు బదిలీలు జరుగనున్నాయి. ఉత్తర్వులు విడుదలైన నాటి నుంచి జులై 9వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఉద్యోగుల అర్హతలను పరిశీలించి నిబంధనల ప్రకారం 13 జులై వరకు బదిలీ ఉత్తర్వులు అందించనున్నారు. అ తరువాత ఎలాంటి బదిలీ ఉత్తర్వులు జారీ చేయరాదని ఉత్తర్వుల్లో వివరించారు.