కొత్తగూడెం జూన్ 25: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె, పట్టణ ప్రగతి పనులపై అధికారులు దృష్టి సారించాలని భద్రాద్రి జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఆదేశించారు. శుక్రవారం జిల్లాకేంద్రంలో నిర్వహించిన జడ్పీ సర్వ సభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలతో పాటు ఇతర పల్లె ప్రగతి పనులను పూర్తి చేయాలన్నారు. త్వరలో తరగతులు ప్రారంభమవుతున్నందున కొవిడ్ ఐసొలేషన్ కేంద్రాలుగా వినియోగించిన పాఠశాలలను శానిటైజ్ చేయాలన్నారు. సర్వ సభ్య సమావేశాలకు అధికారులు విధిగా హాజరుకావాలన్నారు. 2005 కంటే ముందు సాగులో ఉన్న పోడు భూముల జోలికి అటవీశాఖ అధికారులు వెళ్లొద్దన్నారు. జాయింట్ సర్వే చేసి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. చట్టాలను అతిక్రమించి కందకాలు తీస్తే చర్యలు తీసుకుంటామన్నారు. గ్రామాల్లో పెసా గ్రామసభలు నిర్వహించాలన్నారు. ఆదివాసీల సమస్యలు పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలన్నారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖరరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, జడ్పీ సీఈవో విద్యాలత, డిప్యూటీ సీఈవో నాగలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఎంపీపీలు, జడ్పీటీసీలు పలు సమస్యలపై మాట్లాడారు.
రైతులకు ఇబ్బంది కలగొద్దు..: ప్రభుత్వ విప్ రేగా
భూమి హక్కు ఉన్న రైతు పొలాల్లోకి అటవీశాఖ అధికారులు వెళ్లొద్దని ప్రభుత్వ విప్ కాంతారావు అన్నారు. సాగు లేకుండా రైతులు జీవించలేరన్నారు. విద్యుత్ శాఖ అధికారులు జిల్లాలో 48 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించాల్సి ఉండగా కేవలం 30 గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. రెవెన్యూశాఖ అధికారులు పెండింగ్లో ఉన్న భూసమస్యలను పరిష్కరించాలని అన్నారు. రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. రైతుబంధు మంజూరు కాని రైతుల ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి జరుగనున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను విజయవంతం చేయాలన్నారు.