అడవిలో లభించే పండ్లు, గడ్డలతో ఇమ్యూనిటీ
జొన్న జావ, ఇప్పపువ్వు నూనె వినియోగం
ఇంటి ఎదుట నీటి డ్రమ్ము, సబ్బు దర్శనం
బయటికు వెళ్లివస్తే కాళ్లు, చేతులు శుభ్రం చేసుకోవాల్సిందే..
శుభకార్యాల్లో అడవి ఆకుల్లోనే భోజనం
సిరికొండ మండలంలోని పలు గ్రామాలు ఆదర్శం
సిరికొండ, మే 25 : ఆదివాసులను సంప్రదాయాలు, కట్టుబాట్లే కరోనా సోకకుండా కాపాడుతున్నాయి. గ్రామస్తులంతా తీర్మానాలు చేసుకోవడం, వాటిని కచ్చితంగా అమలు చేస్తున్నారు. బయటకు ఎవరైనా వెళ్లి వస్తే చేతులు, కాళ్లు శుభ్రం చేసుకోవడం చేస్తున్నారు. అడవిలో దొరికే పండ్లు, గడ్డలు, ఆకుకూరలు మాత్రమే తీసుకుంటున్నారు. ఆహారంలో ఉదయం జొన్న జావ, పగలు చేపలు, రాత్రి పండ్లు తింటున్నారు. వారానికోసారి పంచాయతీ సిబ్బంది ప్రతి వీధిలో శానిటైజేషన్ చేస్తున్నారు. ఫలితంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలైన పొచ్చంపల్లి, రిమ్మ, మల్లాపూర్ గ్రామ పంచాయతీల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు.
ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఏజెన్సీ ప్రాంతాలైన పొచ్చంపల్లి, రిమ్మ, మల్లాపూర్ గ్రామ పంచాయతీ ప్రజలు సర్కారు నిబంధనలు పాటించడంతో ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. పొచ్చంపల్లి పంచాయతీలో 220 కుటుంబాలు ఉండగా.. 1100 మందికి పైగా గిరిజనులు ఉన్నారు. ఈ గ్రామంలోని గిరిజనులు నిత్యావసరాల కోసం సిరికొండ, ఇంద్రవెల్లి మండల కేంద్రాలకు వెళ్తారు. ఇతరులు గ్రామంలోకి రాకపోకలు సాగించరు. మొదటి, రెండో వేవ్లో కరోనా ప్రభావం కన్పించలేదు. రిమ్మ జీపీ పరిధిలోని గూడేల్లో 160 కుటుంబాలు ఉండగా.. 1,700 మంది గిరిజనులు జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని ప్రతి ఇంటి ఎదుట నీటి డ్రమ్ము, సబ్బు దర్శనమిస్తాయి. కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా బయటకు వెళ్లి వస్తే కచ్చితంగా కాళ్లు, చేతులు శుభ్రం చేసుకొని ఇంట్లోకి వెళ్తారు. వారానికోసారి సర్పంచ్ పెందూర్ అనిల్ ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది శానిటైజేషన్ చేస్తున్నారు. మల్లాపూర్ గ్రామ పంచాయతీలో 103 కుటుంబాలు ఉండగా.. 1,200 మందికి పైగా గిరిజనులు ఉన్నారు. వీరు 15 కిలో మీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రానికి వెళ్లి నిత్యావసర సరుకులు తీసుకొచ్చుకుంటున్నారు. ఏదైనా శుభకార్యం జరిగితే అడవి నుంచి ఆకులు తీసుకొచ్చి అందులోనే భోజనం చేస్తారు.
ఇప్పటి వరకు ఒక్క కేసు నమోదు కాలేదని మల్లాపూర్ బాపురావ్ సర్పంచ్ తెలిపారు. కాగా.. జొన్న జావ, ఇప్పపువ్వు నూనెను వంటల్లో వినియోగిస్తారు. మినరల్ వాటర్, కూల్ వాటర్ వారికి తెలియదు. బావి, బోరింగ్ నీటితో దాహం తీర్చుకుంటారు. అడవిలో లభించే పండ్లు, ఆకుకూరలు, గడ్డలు, చేపలు ఆహారం తీసుకుంటు న్నారు. మాస్కులు, భౌతిక దూరం పాటించాలని గూడేల్లో తీర్మానాలు చేసుకున్నారు. పంచాయతీ సిబ్బంది, సర్పంచ్, కార్యదర్శులు, వైద్యసిబ్బంది కరోనాపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆదివాసీ సంప్రదాయాలను పాటిస్తున్నారు. అందుకే ఆదివాసీ గిరిజనులకు ఇమ్యూనిటీ అధికంగా ఉంటుంది.
మా గూడేల్లోకి రాలేదు..
మా గూడెంలో కరోనా వైరస్ ప్రభావం లేదు. కొత్తవారు గూడెంలోకి వస్తే ముందుగా చేతులు, కాళ్లు కడుక్కొని రావాలని నిబంధన పెట్టాం. మేము కూడా ముందుస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. నిత్యావసరాల కోసం తప్ప మేము కూడా ఇతర గ్రామాలకు వెళ్లం. దీంతో మాకు కరోనా సోకలేదు. అప్పుడప్పడు వైద్యులు, సిబ్బంది, సర్పంచ్ వచ్చి అవగాహన కల్పిస్తున్నారు.
జాగ్రత్త పడుతున్నాం..
గ్రామ పంచాయతీలో ప్రభుత్వ నిబంధనలు అమలు చేస్తున్నాం. కరోనా కట్టడికి గ్రామపెద్దలతో కలిసి గ్రామస్తులం నిర్ణయం తీసుకున్నాం. కరోనా బారినపడకుండా జాగ్రత్త పడుతున్నాం. గ్రామస్తులు కూడా సహకరించడంతో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు నమోదు కాలేదు. ఇప్పటికైతే గూడేల్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పటికీ మా గిరిజన సంప్రదాయ వంటలు చేసుకుంటున్నాం.