కాళేశ్వరం లింక్-1, 2లలో జలాల పరుగులు
38 మోటర్ల ద్వారా ఎత్తిపోతలు
రోజుకు రెండు టీఎంసీలకు పైగా తరలింపు
పెద్దపల్లి, జూన్ 21(నమస్తే తెలంగాణ)/ధర్మారం/రామడుగు/ బోయినపల్లి: కాళేశ్వర గంగ పరుగులు పెడుతున్నది. లింక్-1,2లో పరవళ్లు తొక్కుతున్నది. ఒక్కో పంప్హౌస్లోని మోటర్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల వరకు తరలివెళ్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని లక్ష్మీ పంప్హౌస్లో 12 పంపులు ఆన్చేసి 25,200 క్యూసెక్కుల నీటిని ఎగువన అన్నారంలోని సరస్వతీ బరాజ్లోకి తరలిస్తున్నారు. సరస్వతీ పంపు హౌస్లో 8 పంపులు ఆన్చేసి 26,470 క్యూసెక్కులు పార్వతీ బరాజ్లోకి ఎత్తిపోస్తున్నారు. ఇక పార్వతీ పంప్హౌస్లోనూ 10 పంపులు ఆన్చేసి ఎల్లంపల్లి జలాశయంలోకి 26,100 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు.
లింక్-2లో పరుగులు..
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారంలోని నంది పంప్హౌస్లో 5 మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోస్తున్నారు. మొత్తం 15,750 క్యూసెక్కుల నీటిని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్లోని గాయత్రీ పంప్హౌస్కు.. అక్కడి నుంచి 5 మోటర్ల ద్వారా అదే పరిమాణంలో రాజన్న సిరిసిల్లలోని బోయినపల్లి మండలం శ్రీరాజరాజేశ్వర జలాశయానికి తరలిపోతుంది. జలాల తరలింపును నీటి పారుదల శాఖ రామగుండం ఈఎన్సీ నల్ల వెంకటేశ్వర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎస్సారార్ రిజర్వాయర్ నుంచి10 గేట్ల ద్వారా 15046 క్యూసెక్కుల నీటిని ఎల్ఎండీకి తరలిస్తున్నట్లు తెలిపారు.