మిగిలిన వైకుంఠధామాలను పూర్తి చేయాలి
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి
వైద్య, ఆరోగ్య సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటించాలి
వీడియో కాన్ఫరెన్స్లో ఖమ్మం కలెక్టర్ ఆర్వీ కర్ణన్
మామిళ్లగూడెం, జూన్ 24: పల్లె, పట్టణ ప్రగతి పనులకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 1వ తేదీ నుంచి 10 వరకు పల్లె, పట్టణ ప్రగతి పనులు జరుగనున్న నేపథ్యంలో గురువారం సాయంత్రం ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఇంజినీరింగ్, అటవీ శాఖ అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. మొదటి విడత ప్రగతి పనుల్లో ఇప్పటికే కొన్ని పనులు వందశాతం పూర్తయ్యాయని, కొన్నిచోట్ల వైకుంఠధామాలు, కంపోస్ట్షెడ్స్ పెండింగ్లోనే ఉన్నాయన్నారు. వాటిని వెంటనే పూర్తి చేయాలన్నారు. నర్సరీల నిర్వహణ బాధ్యత ఏపీవోలపై ఉందన్నారు. ఎంపీవోలు కంపోస్ట్ షెడ్స్, డంపింగ్యార్డులు, వైకుంఠధామాల పనులను పూర్తి చేయాలన్నారు. గ్రామసభల నిర్వహణకు మండల ప్రత్యేకాధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆశవర్కర్లు, ఏఎన్ఎంలు, ఇతర ఆర్యోగ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పర్యటించాలన్నారు. గ్రామాల్లో నాటిన ప్రతి మొక్క బతికేలా అధికారులు, ప్రజాప్రతినిధులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అనంతరం ‘తెలంగాణకు హరితహారం’ పోస్టర్ను ఆవిష్కరించారు. కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, నగరపాలక కమిషనర్ అనురాగ్జయంతి, డీఎఫ్వో ప్రవీణ, డీఆర్డీవో విద్యాచందన, డీపీవో ప్రభాకర్రావు, పీఆర్ ఈఈ చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.