అసంక్రామిక వ్యాధుల నిర్మూలన కోసం పనిచేయాలి
కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలి
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బీ మాలతి
ఖమ్మం సిటీ, జూన్ 24: జిల్లాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని, వైద్య సిబ్బంది ఇకనుంచి సీజనల్ వ్యాధుల నివారణ కోసం పనిచేయాలని డీఎంహెచ్వో మాలతి ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలం మొదలైనందున మలేరియా, డెంగీ, టైఫాయిడ్, డయేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందన్నారు. పంచాయతీరాజ్, మున్సిపల్శాఖల సమన్వయంతో వాటిని అరికట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్రై డే పాటించేలా చూడాలన్నారు. అందరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ప్రొగ్రాం ఆఫీసర్స్ లక్ష్మీనారాయణ, సైదులు, రామారావు, అలివేలు, ప్రవీణ, డీఎంవో సంధ్య పాల్గొన్నారు.
అసంక్రామికాలను నిర్మూలించాలి
గ్రామీణ ప్రాంతాల్లో అసంక్రామిక వ్యాధుల నిర్మూలనే ధ్యేయంగా పనిచేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి ఆదేశించారు. గురువారం జిల్లాకేంద్రంలోని డీఎంహెచ్వో కార్యాలయంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నోడల్ సూపర్వైజర్స్తో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలో 30 ఏళ్లు దాటిన ప్రతిఒక్కరికీ స్క్రీనింగ్ చేయాలన్నారు. రక్తపోటు, మధుమేహ బాధితులకు మెడిసిన్ ఇవ్వాలన్నారు. రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారికి వైద్య సలహాలు ఇవ్వాలన్నారు. ఎస్సీడీ- లాజిస్టిక్ మేనేజ్మెంట్ ప్రొగ్రాంను ముందుకు తీసుకెళ్లాలని, వీహెచ్ఆర్ (విలేజ్ హెల్త్ రిజిస్ట్రేషన్), ఆషా డిసీజ్ ప్రొఫైల్ను ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. కార్యక్రమంలో ప్రొగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ కోటిరత్నం, డబ్ల్యూహెచ్వో అధికారి సురేశ్, ప్రొగ్రాం కో-ఆర్డినేటర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.