ముస్లింలను మోసగించిన ఈటలకు ఎన్నికల్లో బుద్ధి చెబుతాం
టీఆర్ఎస్ నాయకులు
హుజూరాబాద్టౌన్, మే 24 : రాజకీయ పబ్బం గడిపేందుకే ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం లేదని టీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణ ప్రధాన కార్యదర్శి మహ్మద్ రియాజ్ ఆరోపించారు. సోమవారం హుజూరాబాద్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులతో కలిసి మాట్లాడారు. వందల సంఖ్యల కార్లలో బల నిరూపణ కోసం షామీర్పేట నుంచి హుజూరాబాద్కు ర్యాలీగా వచ్చినప్పుడు గుర్తుకురాని కరోనా రాజీనామా చెయ్యమనగానే గుర్తుకు వచ్చిందా? అని ఈటలను ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ బీసీ బిడ్డను అని చెప్పుకోని ఆయన పదవి కోల్పోగానే బీసీ సామాజికతను అడ్డు పెట్టుకొని కొత్త రాజకీయానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీల్లో కో ఆప్షన్ ఎన్నికలు పూర్తయి సంవత్సరంన్నర దాటుతున్నా హుజూరాబాద్, జమ్మికుంటలో ఎన్నికలు నిలిపి వేసి మైనార్టీలకు తీవ్ర అన్యాయం చేసింది ఈటల అని గుర్తు చేశారు.
టీఆర్ఎస్ హుజూరాబాద్ నియోజకవర్గ సోషల్మీడియా కన్వీనర్ గాలి రాకేశ్ మాట్లాడుతూ తన ముఖ్య అనుచరులతో కావాలని పార్టీపై, ప్రభుత్వంపై సోషల్మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టించిన ఘనత ఈటలకే దక్కుతుందన్నారు. టీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు షేక్ ఫయాజ్ మాట్లాడుతూ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలోని ముస్లింలను మభ్యపెట్టి మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నాడని మండిపడ్డారు. ముస్లింలకు షాదీఖానా నిర్మాణం, పదెకరాల స్థలం ఇప్పిస్తానని నమ్మించి ఓట్లు వేసుకుని మరచిపోయాడన్నారు. ముస్లిం అనాథ పిల్లల కోసం మదర్సాకు ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తే పట్టించుకోలేదన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది నియోజకవర్గంలో టీఆర్ఎస్సేనని ఎన్నోసార్లు స్వయంగా ఈటలనే చెప్పింది ఇప్పుడు మరచిపోయి తన వెంట ప్రజలు ఉన్నారని చెప్పుకోవడం ప్రజలను తప్పుదారి పట్టించడానికేనని అన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ హుజూరాబాద్ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు గందె సాయిచరణ్, సీనియర్ నాయకులు పంజాల మురళిగౌడ్, బాబా మహ్మద్, కాపర్తి సంతోష్, జక్కుల గోపాల్, తిప్పర్తి వేణు పాల్గొన్నారు.