అన్నదాతల అభివృద్ధి, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం
జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్
వైరా, మే 24: రాష్ట్రంలోని అన్నదాతల అభివృద్ధి, సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక నిధులు కేటాయిస్తున్నట్లు గుర్తుచేశారు. రైతులకు 65 శాతం సబ్సిడీతో జీలుగు విత్తనాల పంపిణీ చేసే కార్యక్రమాన్ని సోమవారం చేట్టారు. వైరాలోని తన క్యాంపు కార్యాలయంలో మండల వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మార్క్ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్తో కలిసి రైతులకు జీలుగు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాములునాయక్ మాట్లాడుతూ రైతులు పండించిన పంటలను ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించి కొనుగోలు చేస్తోందని వివరించారు. రైతులు ప్రస్తుత వానకాలం సీజన్ కోసం సబ్సిడీ జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, వైస్ చైర్మన్ ముళ్లపాటి సీతారాములు, ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసుపులేటి మోహన్రావు, నాయకులు మిట్టపల్లి నాగి, సాదం రామారావు, కట్టా కృష్ణార్జున్రావు, మచ్చా వెంకటేశ్వరరావు, ఏడీఏ బాబురావు, ఏవో పవన్కుమార్, ఏన్కూరు ఏఎంసీ చైర్మన్ భూక్యా లాలు, చల్లా సతీశ్ తదితరులు పాల్గొన్నారు.