ఐటీడీఏ, అటవీ శాఖ సంయుక్త కార్యాచరణ
వారం రోజుల్లో అభివృద్ధి పనులు ప్రారంభం
వంద మందికి ఉపాధి
జలపాతాన్ని సందర్శించిన ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా
తిర్యాణి, జూన్ 23 : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు గుండాలను పర్యాటక ప్రాంతంగా ఎంపిక చేసినట్లు ఐటీడీఏ పీవో భవేశ్ మిశ్రా అన్నారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా అటవీ శాఖ అధికారి శాంతారం, సంబంధిత అధికారులను ఆదేశించారు. గుండాల గ్రామస్తులు, ఆయా శాఖల అధికారులతో కలిసి జలపాత ప్రాంతం, అడవుల్లో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాంతం అన్ని రకాలుగా అనుకూలంగా ఉందన్నారు. అభివృద్ధి కోసం ఇటీవల ఐటీడీఏ, అటవీ శాఖలు సంయుక్తంగా కార్యాచరణ తయారుచేసినట్లు చెప్పారు. వచ్చే వారం నుంచి అభివృద్ధి పనులను ప్రారంభించాలని అధికారులకు ఆదేశాలను జారీ చేసినట్లు తెలిపారు. సమన్వయంతో పనిచేసి, నిర్ణీత గడువులోగా పూర్తిచేయాలని ఆదేశించారు. అటవీ శాఖ తరఫున వెదురు గృహాలు నిర్మించనున్నట్లు తెలిపారు. అతిథులకు ట్రెక్కింగ్, రాక్ ైక్లెంబింగ్, సైక్లింగ్, ఆదివాసీ సంప్రదాయ, సాహస క్రీడలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు, బోటింగ్ తదితర పనులు ప్రారంభించనున్నామన్నారు. గుండాల ఎకో టూరిజం ఏర్పాటుతో 100 మందికి ఉపాధి కలుగనున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ ఏడో విడుత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం గ్రామస్తులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని, అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. అనంతరం గిరిజనులు తమ సమస్యలను పీవో దృష్టికి తీసుకెళ్లారు. గుండాల నుంచి రోంపల్లి గ్రామం వరకు రోడ్డు సౌకర్యం కల్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన వెంట సర్పంచ్ కోట్నాక జంగుబాయి, గిన్నేధరి, తిర్యాణి అటవీ రేంజ్ అధికారులు ప్రణయ్, శ్రీనివాస్, డీఆర్వో లఖన్సింగ్, ఎఫ్బీవో రవి, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.