వేతనాలు తీసుకోకుండా నిస్వార్థంగా సేవచేస్తున్నాం
భూ క్రయ, విక్రయాలపై ఆరోపణలు బాధాకరం
మెట్పల్లి ఖాదీ చైర్మన్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు
మెట్పల్లి,జూన్22: మహాత్ముడి ఆశయాలకు అనుగుణంగా ఖాదీ సంస్థను అభివృద్ధి చేస్తున్నామని మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ చైర్మన్, కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు అన్నారు. బుధవారం సంస్థ కార్యాలయంలో మెంబర్ సెక్రటరీ దార సాంబయ్యతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్కు మెట్పల్లి, పూడూరు, కరీంనగర్, వర్ని తదితర ప్రాంతాల్లో స్థిరాస్తులు ఉన్నాయని, వీటి సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. వృథాగా ఉన్న భూములను విక్రయించి సంస్థను మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఖాదీలో వస్ర్తాల ఉత్పత్తి, విక్రయాలు తగ్గాయని పేర్కొన్నారు. సంస్థలో ఏండ్ల తరబడి పనిచేస్తున్న 850 మంది కార్మికులకు సంస్థ భూముల్లో దుకాణ సముదాయాలను నిర్మించి స్థలాన్ని లీజుకు ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో వేతనాలు చెల్లించి, ఖాదీ అభివృద్ధిని విస్తరించేందుకు వినియోగిస్తున్నామన్నారు. పూడూరులో ఖాదీకి 1.20 ఎకరాల భూమి ఉందని, ఖాళీగా ఉన్న 1.16 ఎకరాల స్థలాన్ని 2019-20 మధ్యలో అప్పటి ఖాదీ చైర్మన్ కేవీ రాజేశ్వర్రావు నేతృత్వంలోని పాలకవర్గ సభ్యుల ఆమోదంతో విక్రయించిందన్నారు. వచ్చిన నగదుతో పూడూరుతో పాటు కరీంనగర్లోని ఖాదీ స్థలాల్లో దుకాణ సముదాయం, కార్యాలయ భవన నిర్మాణ చేపట్టేందుకు అప్పటి పాలకవర్గం తీర్మానించిందన్నారు. పూడూరులో రూ.12 కోట్ల విలువ చేసే భూమిని కేవలం రూ.2 కోట్లకు విక్రయించారంటూ ప్రతిపక్ష నేతలు ఆరోపణలు చేయడం విచారకరమన్నారు.
వారు రూ.6 కోట్లు చెల్లించేందుకు ముందుకు వస్తే ఆ భూమిని కొనుగోలుదారు నుంచి తిరిగి ఇప్పించేందుకు సిద్ధమని తెలిపారు. ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమేనని తాను, మెంబర్ సెక్రటరీ, ఇతర కార్యవర్గం ఏ ఒక్కరూ వేతనాలు తీసుకోవడం లేదని, నిస్వార్థంగా సేవ చేస్తున్నామని స్పష్టం చేశారు. మెట్పల్లిలో జాతీయ రహదారి, వెల్లుల్ల రోడ్డు వెంబడి కలిపి 200కు పైగా దుకాణాల కోసం గదులను నిర్మించామని, వాటి ద్వారా అద్దె రూపంలో నెలకు రూ.12 లక్షలు వస్తున్నాయన్నారు. ఎకరం స్థలాన్ని సమీకృత మార్కెట్ కోసం లీజుకు ఇచ్చామని చెప్పారు. మాజీ ప్రధాని పీవీ లాంటి ఎందరో మహనీయులు చైర్మన్లుగా పనిచేసిన మెట్పల్లి ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్ఠాన్ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేస్తామని చెప్పారు. ఇక్కడ ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేదని, వాస్తవాలు తెలుసుకోకుండా రాజకీయంగా లబ్ధిపొందాలనే దురాశతో కొందరు ఖాదీపై బురదచల్లాలనే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పట్టణంలోని సర్వే నం.815లో ఓ వ్యక్తి 77 మీటర్ల స్థలాన్ని ఆక్రమించినట్లు రెవెన్యూ సర్వేలో తేలిందని, వారికి కోర్టు నుంచి నోటీసులు పంపారన్నారు. దీనిపై తాము కూడా కోర్టు వెళ్లి ఆక్రమిత స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని స్పష్టంచేశారు. సమావేశంలో ఎంపీపీ మారు సాయిరెడ్డి తదితరులున్నారు.