ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య
మామిళ్లగూడెం, మే 23 : ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో తగినంత సిబ్బందిని నియమించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలెక్టర్ను కోరారు. ఆదివారం కలెక్టర్ కర్ణన్తో కలిసి సత్తుపల్లి నియోజక వర్గ పరిధిలో కొవిడ్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, ఆరోగ్య సిబ్బంది, అందుబాటులో ఉన్న మందుల వివరాలపై చర్చించారు. నియోజకవర్గానికి పక్కనే ఆంద్రప్రదేశ్ రాష్ట్ర మండలాలకు సరిహద్దుగా ఉండడంతో రాకపోకలు ఎక్కువగా జరగడంతో కరోనా కేసులు, మరణాల రేటు ఎక్కువగా నమోదు అవుతున్నాయని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పోలీసుల సహకారంతో ఇతర అధికార యంత్రాంగం సరిహద్దుల్లో బందోబస్తు కొనసాగుతుందన్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ కేంద్రాల్లో రోగులకు అవసరమైన ప్రాథమిక వైద్యాన్ని ఆశా వర్కర్ల ద్వారా అందిస్తున్నామని, వారికి కావాల్సిన పౌష్టికాహారం, భోజనాన్ని దాతల సహకారంతో అందిస్తున్నామని తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గం పరిధిలో ప్రతి రోజు 1000 మందికి కరోనా పరీక్షలు చేయాలని వైద్య శాఖ సిబ్బందిని కలెక్టర్ ఆదేశించడం పట్ల ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కలెక్టర్ ఆర్వీ కర్ణన్కు ధన్యవాదాలు తెలిపారు.
ధాన్యం కొనుగోళ్లు పెంచండి..
యాసంగి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి రైతులను ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అదనపు కలెక్టర్ మధుసూదన్రావును ఆదివారం కలిసి విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో రైతులు తమ చేతికి వచ్చిన పంటను కల్లాల్లో ఆరబోసి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని, అయినా అనుకున్న రీతిలో కొనుగోళ్లు జరగడంలేదని, వాతావరణ పరిస్థితులు, తుఫాన్ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి వారికి మిల్లర్లను కేటాయించి త్వరితగతిన కొనుగోళ్లు చేయాలని ఎమ్మెల్యే కోరారు.