అర్బన్, రూరల్ జిల్లాల పేరు మార్పు
మారనున్న జిల్లాల స్వరూపం
సీఎం కేసీఆర్ ప్రకటనతో కొత్త రూపు
వరంగల్ జిల్లాలోకి వరంగల్, ఖిలా వరంగల్ మండలాలు
హన్మకొండలోకి వర్ధన్నపేట,పర్వతగిరి, రాయపర్తి
జిల్లా ప్రజాప్రతినిధుల ప్రతిపాదన
వరంగల్ ప్రాంతం వేగంగా అభివృద్ధికి అవకాశం
వరంగల్, జూన్ 22 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నిన్నమొన్నటిదాకా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్గా ఉన్న జిల్లాలు ఇక హన్మకొండ, వరంగల్గా మారనున్నాయి. ప్రజలు, ప్రజాప్రతినిధుల విజ్ఞప్తులపై స్పందించిన సీఎం కేసీఆర్ సోమవారం నగరంలో పర్యటించిన సందర్భంగా ఈ మేరకు ప్రకటించారు. వరంగల్ రూరల్ జిల్లాకు ఇప్పటికీ పరిపాలన కేంద్రం ఏర్పాటు కాకపోవడంపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రత్యేకంగా వరంగల్ రూర ల్ జిల్లాకు సొంత ప్రదేశం లేకపోవడం కొంత ప్రతికూలం గా మారింది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరంగల్ అర్బ న్, వరంగల్ రూరల్ జిల్లాల మార్పులపై స్పష్టత ఇచ్చారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్, చీఫ్విప్ వినయభాస్కర్, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనల మేరకు మార్పులు చేస్తామని ప్రకటించారు. వరంగల్ రూరల్ జిల్లాను వరంగల్గా అర్బన్ జిల్లా ను హన్మకొండ జిల్లాగా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుత అర్బన్ కలెక్టరేట్ను హన్మకొండ కలెక్టరేట్గానే పరిగణించాలని చెప్పారు. వరంగల్కు అజంజాహీ మిల్లు ప్రాంతంలో కొత్త కలెక్టరేట్ను కట్టుకుందామని చెప్పారు. జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అం దరూ రెండు చారిత్రక నగరాల పేర్లతో జిల్లాలు ఏర్పాటు చేయాలని కోరిన మేరకు ముఖ్యమంత్రి ప్రకటించారు. రెండు జిల్లాల సరిహద్దుల్లో కొన్ని మార్పులు చేసి వరంగల్, హన్మకొండ పేర్లతో ఏర్పాటు చేద్దామని చెప్పా రు. వరంగల్లోని ఆటోనగర్ లేదా అజంజాహీ ప్రాంతం బాగుండాలని, అక్కడి ప్రాంతంలో వరంగల్ జిల్లా పరిపాలన కేంద్రం నిర్మాణం చేపట్టాలని, ఈ మేరకు రెండుమూ డు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ను అప్పటికప్పుడే ఆదేశించారు. సీఎం కేసీఆర్ తాజా ప్రకటనతో జిల్లాల మార్పులపై చర్చ మొదలైంది. ప్రభుత్వం ఇచ్చే ఉత్తర్వులతో రెండుమూడు రోజుల్లో దీనిపై స్పష్టత రానుంది.
నగరంలో రెండు జిల్లా కేంద్రాలు..
వరంగల్, హన్మకొండ జిల్లాల ఏర్పాటు విషయంలో అభివృద్ధి ప్రాతిపదిక స్పష్టంగా కనిపిస్తున్నది. వరంగల్ ప్రాంతంలో జిల్లా సమీకృత కార్యాలయాల భవనం నిర్మాణంతో అక్కడ కూడా అభివృద్ధి వేగంగా విస్తరించనుంది. జిల్లా కేంద్రంగా ఉండడం వల్ల వరంగల్కు కొత్త రూపు సంతరించుకోనుంది. గ్రేటర్ వరంగల్ పరిధిలోనే రెండు జిల్లాలు ఉంటాయి. పరిపాలన మరింత సౌలభ్యంగా ఉండనుంది. మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం.. ప్రస్తుత రూరల్ జిల్లాగా ఉన్నదాన్ని వరంగల్గా మార్చి వరంగల్, ఖిలా వరంగల్ మండలాలను ఇందులో చేర్చాలని ప్రదిపాదించారు. వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చాలని కోరుతూ రూరల్లో ఉన్న వర్ధన్నపేట, రాయపర్తి, పర్వతగిరి మండలాలను హన్మకొండలో చేర్చాలని పేర్కొన్నారు. రెండు జిల్లాలో జనాభా సమతూకం నేపథ్యంలో ఇలా చేస్తే పరిపాలన సౌలభ్యంగా ఉంటుందని వివరించారు. హన్మకొండ జిల్లాలో 12 మండలాలు ఉంటాయి. ఇక్కడ జనాభా 8.80 లక్షలు ఉంటుంది. వరంగల్ జిల్లాలో 15 మండలాలు ఉండనున్నాయి. ఈ జిల్లా పరిధిలో జనాభా 9.18 లక్షలు ఉంటుంది. ఒకే జిల్లాలో ఎక్కువ జనాభా ఉండడం వల్ల పాలన వ్యవస్థపై ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి ప్రతికూల అంశాలను తొలగించేందుకు వీలుగా జిల్లాల పేర్లతోపాటు సరిహద్దులను సైతం మార్చాలని సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజాప్రతినిధులు ప్రతిపాదించారు. త్వరలోనే దీనిపై స్పష్టతనిస్తూ ఉత్తర్వులు వెలువడనున్నాయి.