గ్రీన్ బడ్జెట్’తో పచ్చదనానికి పెద్దపీట
గ్రేటర్ ఆధ్వర్యంలో సొంతంగా నర్సరీల నిర్వహణ
హరితహారానికి సిద్ధంగా వివిధ రకాల మొక్కలు
గ్రేటర్ టార్గెట్ 16లక్షల మొక్కలు
అందుబాటులో17లక్షలు
పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
వరంగల్ రూరల్, జూన్ 22(నమస్తే తెలంగాణ) ;‘సచ్చిన మనిషి కోసం ఏడ్వన్నా.. అంత్యక్రియలకు జాగ లేక ఏడ్వన్నా.. అటువంటి బాధలు మనకు రావద్దనే వైకుంఠధామాలు కట్టుకుంటున్నం’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాటి నగర పర్యటనలో ఎంతో భావోద్వేగంతో చెప్పిండు. ‘చివరి’ కష్టాలను రూపుమాపాలన్న బృహత్తర సంకల్పంతో పల్లె ప్రగతిలో భాగంగా ఊరూరా శ్మశాన వాటికలు నిర్మిస్తున్నడు. కానీ, కొన్ని గ్రామాల్లో వైకుంఠధామాల పనులు మొండిగోడలకే పరిమితమైనా, మొత్తం పూర్తయినట్లు అధికారులు సర్కారుకు నివేదికలు పంపడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నరు.
పల్లెలు, పట్టణాలు, నగరాలు పచ్చదనంలో కళకళలాడాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనితో పాటు స్థానిక సంస్థల బడ్జెట్లో 10శాతం గ్రీన్ బడ్జెట్కు కేటాయించాలని కొత్త మున్సిపల్ చట్టం చేయడంతో పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నారు. గ్రేటర్ వరంగల్లోని రూ.20 కోట్ల గ్రీన్ బడ్జెట్ నిధులతో పార్కులను అభివృద్ధి చేస్తోంది. నర్సీలు ఏర్పాటు చేసి లక్షల మొక్కలు పెంచుతున్నారు. పచ్చదనం పెంపొందించడంపై గ్రేటర్ అధికారులు ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. మరో 20 రోజుల్లో ప్రభుత్వం హరితహారం చేపట్టనున్న నేపథ్యంలో బల్దియా అధికారులు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు.
గ్రీన్ బడ్జెట్తో పచ్చదనం
గ్రీన్ బడ్జెట్ ఫలితంగా నగరాలు, పట్టణాలు పచ్చదనంతో కళకళలాడుతున్నాయి. గ్రీన్ బడ్జెట్ నిధులను ఇతర పనులకు మళ్లించే అవకాశం లేకపోవడంతో స్థానిక సంస్థలు పక్కాగా వినియోగిస్తున్నాయి. వీటితో నర్సరీలు ఏర్పాటుచేస్తూ పచ్చదనానికి పెద్దపీట వేస్తున్నాయి. గ్రేటర్ గ్రీన్ బడ్జెట్లో భాగంగా రూ.20 కోట్లు నిధులు కేటాయించారు. వాటితో నర్సరీలు, పార్కులు అభివృద్ధి చేస్తున్నారు. గ్రీన్ బడ్జెట్ నిధులతో గ్రేటర్ కార్పొరేషన్ రాశీవనం, వనితా వనం, వృక్షజ్ఞాపక వనం, ఎకో తరంగ్ పార్క్, బటర్ఫ్లై పార్కు, మంకీ ఫుడ్కోర్టులతో పాటు అనేక డివిజన్లలో పార్కులను తీర్చిదిద్దడంతో నగరం కొత్తకళ సంతరించుకుంటోంది. జంక్షన్లు, రహదారుల వెంట ఉన్న సెంట్రల్, మీడియం డివైడర్లలో మొక్కలు నాటుతూ వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. గ్రీన్ బడ్జెట్ నగరాలు, పట్టణాల్లో పచ్చదనానికి ఊపిరిపోస్తోంది.
17 నర్సరీలు.. 17 లక్షల మొక్కలు
గ్రేటర్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 17 నర్సరీలున్నాయి. ప్రతి నర్సరీలో లక్ష మొక్కల చొప్పున 17 లక్షల మొక్కలు హరితహారానికి సిద్ధంగా ఉంచారు. వడ్డేపల్లి బండ్పై 3, బాలసముద్రంలో 2, క్రిస్టియన్ కాలనీలో 3, హసన్పర్తిలో 2, మడికొండలో 2, సాయిబృందావన్ లేవుట్లో 3, సూర్యకుటీర్ లే అవుట్లో 2 నర్సరీలను కార్పొరేషన్ నిర్వహిస్తోంది. ప్రభుత్వం మొదట బల్దియాకు 12 లక్షల టార్గెట్ ఇవ్వగా ఆ తర్వాత దానిని 16లక్షలకు పెంచింది. దీనికి తగ్గట్టుగా అధికారులు వివిధ రకాల మొక్కలను నర్సరీల్లో సిద్ధంగా ఉంచారు. ఇందులో పూలు, పండ్ల మొక్కలు 40శాతం ఉన్నాయి.