24 నుంచి 26 వరకు బోనాల ఉత్సవాలు
చౌటుప్పల్ రూరల్, జూలై 21: మండల పరిధిలోని ఆందోళ్మైసమ్మ దేవాలయం 16వ బోనాల ఉత్సవాలకు ముస్తాబవుతోంది. దేవాలయాన్ని ఇప్పటికే రంగురంగులతో సుందరీకరించారు. విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేశారు. కొవిడ్ నిబంధనల మేరకు ఈనెల 24 నుంచి 26 వరకు ఉత్సవాలు జరుగనున్నాయి. మూడురోజుల పాటు ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. అమ్మవారికి బోనాల నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. భక్తుల సాకర్యం కోసం తాగునీటి వసతి, మూడురోజుల పాటు అన్నదానం నిర్వహిస్తున్నారు. పార్కింగ్ సమస్యలు తలెత్తకుండా ఆలయానికి కొంతదూరంలో వాహనాలు నిలిపేలా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి ఏటా ఆషాఢ మాసంలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రధానంగా ఈ ఆలయంలో బోనాల పండుగకు ప్రత్యేకత ఉంది. బోనాలు చేసే
భక్తులకు వాటిని తయారు చేయడానికి ప్రత్యేక వసతి గృహాలు కేటాయించారు. ఈ ఉత్సవాలు ప్రారంభమైన రెండో రోజు వైభవంగా బోనాల పండుగ జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు పనులు సఫలీకృతంకావడంతో భక్తుల రద్ధీ విపరీతంగా ఉంటుంది. హైదరాబాద్కు అతి సమీపంలోని 65వ జాతీయ రహదారి పక్కన ఆలయం ఉండటంతో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు ఉమ్మడి నల్లగొండ జిల్లానే కాకుండా హైదరాబాద్, రంగారెడ్డి, మహబుబ్నగర్, వరంగల్ తదితర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. భక్తులు సైతం తప్పకుండా పాటించాలి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వసతులు ఏర్పాటు చేస్తున్నాం. తాగునీరు, పార్కింగ్ ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. బోనాల ఏర్పాటుకు ప్రత్యేక గదులు కూడా కేటాయించాం.
-చిట్టెడి వెంకట్రెడ్డి,ఆలయ ఈవో